ప్రసన్నవదనం మీద పెద్దల నమ్మకం

పరిమిత బడ్జెట్ లోనే విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న సుహాస్ ఇప్పుడు మోస్ట్ బిజీ హీరోల్లో ఒకడిగా మారిపోయాడు. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో కమర్షియల్ గా వర్కౌట్ అయ్యి లాభాలు తెచ్చినవాటిలో తన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు కూడా ఉంది. నిన్న వారం శ్రీరంగనీతులు రిలీజయ్యింది కానీ ఫలితం ముందే ఊహించిన సుహాస్ ప్రమోషన్లలో చాలా పరిమితంగా కనిపించాడు. దానికి తగ్గట్టే అసలు వచ్చిన జాడే లేనంత దారుణంగా బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది. వచ్చే నెల మే 3న ప్రసన్నవదనంతో సుహాస్ పలకరించబోతున్నాడు. పబ్లిసిటీ బాగానే చేస్తున్నారు.

విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని తెలుగు మైత్రి సంస్థ పంపిణి చేస్తుండగా కర్ణాటకలో ఆ బాధ్యతను హోంబాలే ఫిలిమ్స్ తీసుకుంది. దీన్ని బట్టి కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సుహాస్ కూడా యాక్టివ్ గా వరస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మొహాలు మర్చిపోయే విచిత్రమైన జబ్బుతో బాధపడే వ్యక్తిగా సుహాస్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసినట్టు టీజర్ చూశాక అర్థమయ్యింది. ఎమోషన్లు, ప్రేమలు లాంటి జానర్ కాకుండా ఒక థ్రిల్లర్ తరహాలో చేసిన ఈ ప్రయోగం ఖచ్చితంగా మంచి ఫలితమిస్తుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. అందుకే డిస్ట్రిబ్యూషన్ పెద్దల అండదండలు దొరికాయి.

ఇది హిట్ అయితే సుహాస్ మార్కెట్ తో పాటు రేంజ్ పెరుగుతుంది. ఇప్పటిదాకా తను పది కోట్ల మార్క్ దాటలేకపోయాడు. రైటర్ పద్మభూషణ్ ఒకటే ఆ మార్కుకు దగ్గరగా వెళ్ళింది. ఈ ఏడాది ఎంత లేదన్నా ఇంకో మూడు సినిమాలు రిలీజవుతాయి కాబట్టి ప్రసన్నవదనం సక్సెస్ తాలూకు ప్రభావం వాటికి సానుకూలంగా పని చేస్తుంది. ఎల్లుండి వచ్చే ట్రైలర్ చూశాక హైప్ లో అమాంతం మార్పు వస్తుందని టీమ్ నమ్మకం. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ నందు హీరోయిన్లుగా నటించగా బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఆ రోజు పోటీ అయితే గట్టిగానే ఉంది.