బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా

ఫిలిం, స్పోర్ట్స్ సెలబ్రెటీలు సినిమాలకు పరిమితం కాకుండా బ్రాండ్ ప్రమోషన్లు చేయడం కొత్తేమీ కాదు. కానీ తమ ప్రొఫెషన్లో భాగంగా ప్రచారం చేసే క్రమంలో కొన్నిసార్లు ఆయా సంస్థలు చేసే తప్పులకు సెలబ్రెటీలు బాధ్యత వహిచాల్సి ఉంటుంది. గతంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చేసిన మోసాలకు సెలబ్రెటీలు కోర్టులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఆమె ప్రచారం చేసి పెట్టిన ఓ బెట్టింగ్ యాప్ నిర్వాకానికి తమన్నా పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ యాప్ పేరు.. ఫెయిర్ ప్లే. సామాజిక మాధ్యమాల్లో యువత దృష్టిని కొన్నేళ్లుగా బాగా ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్‌లో ఇది ఒకటి.

ఇండియాలో బెట్టింగ్ చేయడం చట్టవిరుద్ధం అన్న సంగతి తెలిసిందే. ఐతే చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుని ఇలాంటి యాప్స్ గేమ్స్ రూపంలో బెట్టింగ్‌ను నడిపిస్తుంటాయి. వీటికి సెలబ్రెటీలు కూడా ప్రచారం చేస్తుంటారు. ఐతే ఫెయిర్ ప్లే యాప్ ఒక అడుగు ముందుకు వేసి.. ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలను కూడా తమ యాప్‌లో చూడొచ్చని ప్రచారం చేసింది. ఈ ప్రచారంలో తమన్నా కూడా భాగమైందట.

ఐతే ఐపీఎల్ ఆన్‌లైన్ ప్రసార హక్కులను వేల కోట్లు పోసి కొనుక్కున్న వయాకామ్ 18 సంస్థ ఊరుకుంటుందా? ఫెయిర్ ప్లే మీద కేసు వేసింది. దీంతో ఈ సంస్థకు ప్రచారం చేసిన సెలబ్రెటీలందరినీ పిలిచి ముంబయి పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తమన్నా కూడా విచారణకు హాజరైంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌కు సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారట. ఆయన త్వరలోనే విచారణకు హాజరు కానున్నారు.