రాజంపేటకు రాంరాం చెప్పినట్లేనా ?!

ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లోక్ సభ నియోజకవర్గాలలో రాజంపేట ఒకటి. దశాబ్దాలుగా తాతలు, తండ్రుల కాలం నుండి రాజకీయ వైరం ఉన్న రెండు కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఇద్దరూ ఈ సారి ఒకరిని ఒకరు ఢీకొడుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఈసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ రెండు కుటుంబాల్లో ఒకటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిది కాగా, మరొకటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. ఈ ఇద్దరూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు కేంద్రంగా రాజకీయాలు మొదలుపెట్టిన వారే. కిరణ్‌కుమార్‌ తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి నుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా విభేధాలున్నాయి.

రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా వీరికి అస్సలు పడేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమ రాజకీయాల మీద ప్రభావం చూపుతున్నది. పెద్దిరెడ్డితో పాటు ఆయన సోదరుడు, ఆయన కుమారుడు చట్ట సభలకు ఎన్నికై తమ ఉనికిని చాటుకుంటున్నారు.

2014 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్ర, తెలంగాణ విభజనతో రాజకీయ ఉనికిని కోల్పోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఈ సారి రాజంపేట లోక్ సభ నుండి పోటీ చేస్తున్నారు. నల్లారి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి పీలేరు నుండి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పోటీలో ఉండగా, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా మరోసారి పోటీలో ఉన్నాడు.

రాజంపేట లోక్ సభ పరిధిలో పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబల్లపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 40 ఏళ్లలో 13 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 2014, 2019లో వరసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి మిధున్ రెడ్డి విజయం సాధించాడు. గత 40 ఏళ్లలో ఇక్కడ టీడీపీ ఒకసారి మాత్రమే విజయం సాధించింది.

1999లో టీడీపీ అభ్యర్థి గునిపాటి రామయ్య విజయం సాధించాడు. అందుకే ఈ స్థానం మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్దగా ఆసక్తి చూపకుండా పొత్తు అవకాశం వస్తే ఇతర పార్టీలకే వదిలేస్తారు. 2014లో బీజేపీ పొత్తు సమయంలో ఇక్కడి నుండి పురంధేశ్వరి పోటీ చేసి మిధున్ రెడ్డి చేతిలో లక్ష 80 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా, 2019లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభ మీద మిధున్ 2.70 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు.

రాజంపేటలో మైనారిటీల ఓట్లే కీలకం. వారే ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ తరపున కిరణ్ కుమార్ రెడ్డి ఎంత వరకు నెగ్గుకు రాగలుగుతాడు అన్నది అనుమానమే. పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థులతో కలిసి గట్టి ప్రయత్నమే చేస్తున్నా మైనారిటీలు అధికంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులు బీజేపీతో కలిసి ప్రచారానికి వెనకడుగు వేస్తున్నారు. మోడీ ఆకర్షణతో విజయం సాధిస్తామని బీజేపీ భావిస్తున్నది. అయితే దశాబ్ద కాలం తర్వాత తిరిగి ఎన్నికల బరిలోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలలో ఓడిపోతే రాజకీయ జీవితం ముగిసినట్లేనని భావిస్తున్నారు.