గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఈ ఎన్నికలలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద గెలిస్తే ఎంపీ అయి కేంద్ర మంత్రి అవుతానని, ఓడిపోతే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతానని తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని అమె అంటున్నారట.

హైదరబాాద్ ఎంపీ సీటు అనేది హాట్ సీట్. అందుకే దేశంలోని అందరి దృష్టి అక్కడే ఉంది. ఈ స్థానం నుండి సలాఉద్దీన్ ఓవైసీ ఆరు సార్లు, అసదుద్దీన్ ఓవైసీ నాలుగు సార్లు విజయం సాధించారు. నాలుగు దశాబ్దాలుగా అక్కడ వారిదే హవా. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా మాధవీలతను బరిలోకి దింపింది. శ్రీరామనవమి రోజు బాణం ఎక్కుపెట్టినట్లు వైరలైన మాధవీలత వీడియో ఎన్నికల హీట్ ను పెంచింది.

పాతబస్తీలో ఎంఐఎం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అడ్డుకుంటానని, మైనార్టీలు, హిందువులకు ఎంఐఎం న్యాయం చేయడం లేదని, హైదరాబాద్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని, 40 ఏళ్ల తర్వాత ఇక్కడి ప్రజలకు మంచి రోజులు రానున్నాయని మాధవీలత ప్రచారంలో దూసుకుపోతున్నది.

బీజేపీలో మహిళా అగ్రనేతలు సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ ల మాదిరిగా మాధవీలత ఎదిగిపోవడం ఖాయమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఏం చెప్పిందో కానీ రాష్ట్రంలో మిగిలిన బీజేపీ అభ్యర్థుల కన్నా ప్రచారంలో ఆమె అగ్రభాగంలో నిలుస్తున్నారన్నది వాస్తవం.