తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గ‌తంలో ఒక‌సారి త‌ప్పిపోయిన ఎమ్మెల్సీ సీటు ఈ ద‌ఫా ద‌క్కింది. దీంతో తాజాగా ఆయ‌న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. దీనికి ముందు తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న కుటుంబానికి , త‌న‌కు ఉన్న ఆస్తుల‌ను ప్ర‌భుత్వానికి ఇచ్చేశారు.

ఈ మేర‌కు ఆయ‌న తన కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తిని తెలంగాణ స‌ర్కారు పేరుతో బాండు రాసిచ్చారు. బాండులో పేర్కొన్న లెక్క‌ల ప్ర‌కారం తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు కోటీ 50 ల‌క్ష‌ల మేర‌కు ఆస్తులు ఉన్నాయి. వీటిని తాను ప్ర‌భుత్వానికి ఇస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. గ‌తంలో తాను మాట ఇచ్చాన‌ని.. తాను ప్ర‌జాప్ర‌తినిధిగా పోటీ చేయాల్సి వ‌స్తే.. ఆస్తులు ప్ర‌భుత్వ ప‌రం చేస్తాన‌న్నాన‌ని.. ఇప్పుడు అదే ప‌నిచేస్తున్నాన‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న ప్ర‌క‌టించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా తొలిసారి తీన్మార్ మ‌ల్ల‌న్న శాస‌న మండ‌లికి పోటీ చేస్తున్నారు.

ఇదిలావుంటే.. త‌న సునిశిత విశ్లేష‌ణ‌.. విమ‌ర్శ‌ల‌తో నిరంత‌రం మీడియాలో ఉన్న మ‌ల్ల‌న్న ప్ర‌భుత్వ తీరును తీవ్ర‌స్థాయిలో ఎండ‌గ‌ట్టేవారు. ఒక ద‌శ‌లో కేసులు కూడా ఎదుర్కొని జైలుకు వెళ్లారు. అయినా..ఎక్క‌డా వెనుదిరిగి చూడ‌లేదు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న టికెట్ ఆశించారు. కానీ, చివ‌రి నిముషంలో త‌ప్పిపోయింది. త‌ర్వాత‌.. సీఎం రేవంత్‌రెడ్డి ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించినా.. అక్క‌డ కూడా ఇబ్బంది ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌వీన్‌కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ఆఫ‌ర్ చేశారు. స్థానికంగా బ‌లం ఉండ‌డం, గ్రాడ్యుయేట్ల ఫాలోయింగ్ ఉండ‌డంతో తీన్మార్ మ‌ల్ల‌న్న విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం మెండుగా ఉంది.