కూతుర్ని చంపేసి పూడ్చేసిన పేరెంట్స్

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఒక అరాచక ఉదంతాన్ని నోటితో కూడా చెప్పలేనిది. ఎంత ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం.. మరీ అంత దారుణానికి పాల్పడటమా? అన్నది ప్రశ్నగా మారింది.

ప్రేమించినోడ్ని పెళ్లి చేసుకుందన్న కారణంగా.. ఆమెను ఆమె తల్లిదండ్రులే చంపేయటమేకాదు.. ఇంటికిసమీపంలో పూడ్చేసి మిస్సింగ్ కేసు పెట్టిన దారుణ ఉదంతం తాజాగా వెలుగు చూసింది.

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభుని సత్రానికి చెందిన వెంకటరమణయ్య.. దేవసేనమ్మకు ఒకకొడుకు.. ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురు 24 ఏళ్ల శ్రావణి. ఆరేళ్ల క్రితం పెళ్లి చేయగా.. భర్తతో విడిపోయారు. వీరికి ఊళ్లో కూరగాయల షాపు ఉండేది.

ఈ క్రమంలో ఆమెకు రబ్బానీ బాషాతో పరిచయమై.. ప్రేమగా మారింది. 20 రోజుల క్రితం కసుమూరు దర్గాలో వారు పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కూతుర్ని కొట్టి.. బలవంతంగాఇంటికి తీసుకొచ్చారు.

ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రావణిని తీవ్రంగా కొట్టటంతో గాయమై చనిపోయింది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకుఇంటి పక్కనే ఉన్న స్థలంలో గుంత తీసి పూడ్చేశారు. పోలీసులకు ఫోన్ చేసి తమ కుమార్తె కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా.. వారు ఉంటున్న ఇంటి పక్కన ప్రాంతంలో ఒక మహిళ డెడ్ బాడీని పూడ్చి పెట్టారంటూ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు డయల్ 100కు ఫోన్ చేశారు.

దీంతో స్పందించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద ప్రదేశంలో తవ్వగా.. శ్రావణి డెడ్ బాడీ కనిపించింది.
నమూనాలు తీసుకొని.. తిరిగి అక్కడే పూడ్చి పెట్టారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మిస్సింగ్ కేసును కాస్తా హత్య కేసుగా మార్చారు. ఈ ఉదంతం స్థానికంగానే కాదు జిల్లాలోనూ సంచలనంగా మారింది.