మోడీ రీల్స్ ఉచ్చు మేత చీఫ్ కు ఎలా చుట్టుకుంది

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం మెటా ఇండియా చీఫ్ అరుణ్‌కుమార్‌పై హైద‌రాబాద్‌లో కేసు న‌మోదైంది. బీజేపీ నాయ‌కులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై అభ్యంత‌రక‌ర రీతిలో రీల్స్‌ను పోస్టు చేసిన విష‌యంపై అందిన ఫిర్యాదుల మేర‌కు అరుణ్‌పై కేసులు పెట్టిన‌ట్టు తెలిపారు. ఇప్ప‌టికే మెటా సంస్థ‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హంతో ఉండ‌డంతో తాజాగా ఈ కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

నీట్ ప్ర‌శ్న ప‌త్రం లీకేజీకి సంబంధించి.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో యువ‌త ఢిల్లీలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ స‌మ‌యంలో జాతిని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మోడీ అర్ధ‌రాత్రి పూట త‌న సందేశాన్ని సెల్ఫీ వీడియోల రూపంలో ఇన్‌స్టాలో విడుద‌ల చేశారు. ఇలా మొత్తం మూడు సార్లు ఆయ‌న సెల్ఫీ వీడియోల‌ను పోస్టు చేశారు. అయితే.. వీటికి అనుబంధంగా ప్ర‌ధాని మ‌రిన్ని పోస్టులు పెట్టారంటూ.. ఆయ‌న ముఖ చిత్రంలో న‌కిలీ వీడియోలు సోషల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేశాయి.

ఢిల్లీలో జ‌రిగిన నిర‌స‌న‌లు, పోలీసుల దాడుల‌ను స‌మ‌ర్థించేవిగా ఆయా వీడియోలు ఉన్నాయి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించి.. ఆ వీడియోలు ప్ర‌ధాని చేసిన‌వి కావ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. ఇదే సమ‌యంలో మెటా సంస్థ‌సైతం ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని తొల‌గించింది. మ‌రోవైపు.. అప్ప‌టికే ప్ర‌ధాని పోస్టు చేసి వీడియోల‌ను కూడా మెటా తొల‌గించింది. దీంతో కేంద్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌ధాని పోస్టు చేసిన వాస్త‌వ వీడియోల‌ను తొల‌గించ‌డంపై వివ‌ర‌ణ కోరింది.

దీనికి మెటా సంస్థ‌.. సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చింది. త‌మకు సాంకేతిక లోపం త‌లెత్తింద‌ని.. అందుకే అవి తొలిగిపోయాయ‌ని.. గుర్తించిన వెంట‌నే రీస్టోర్ చేశామ‌ని వివ‌రించింది. అయితే.. కేంద్రం ఈ వివ‌ర‌ణ‌తో సంతృప్తి చెందలేదు. ఈ క్ర‌మంలోనే స్వ‌యంగా వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మెటా సంస్థ‌ను ఆదేశించింది. మ‌రోవైపు.. ప్ర‌ధాని న‌కిలీ వీడియోల వ్య‌వ‌హారం కూడా దేశ‌వ్యాప్తంగా దుమారం రేప‌డంతో బీజేపీ నాయ‌కులు సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మెటా ఇండియా చీఫ్ అరుణ్‌కుమార్‌పై కేసు న‌మోదుచేశారు.