కుమారి ఆంటీ పెద్ద మనసు

కొంతమంది కొన్నిసార్లు ఇట్టే ఫేమస్ అయిపోతారు. సాదాసీదా జీవితాలే అయినప్పటికీ.. ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోతుంటారు. అలాంటి కోవలోకే వస్తారు కుమారి ఆంటీ. ఐటీ నగరిలో ఫుట్ పాత్ మీద చిన్న హోటల్ పెట్టుకొని.. రుచికరమైన ఫుడ్ ను సరసమైన ధరల్లో అందించే కుమారి ఆంటీ షాపుపై అధికారులు ప్రతాపం చూడటం.. దీనిపై ఆమె ఆవేదనకు.. నెటిజన్లు.. సోషల్ మీడియా అండగా ఉండటం తెలిసిందే. కట్ చేస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్టు కావటం.. అభయం ఇవ్వటంతో ఆమె జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.

అలా కొన్నివారాల పాటు నాన్ స్టాప్ గా వార్తల్లో వ్యక్తిగా మారిన కుమారి ఆంటీ.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమె తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వారికి సాయంగా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50వేలు సాయాన్ని చెక్కు రూపంలో అందించారు. చిరు మొత్తమే అయినా.. ఇస్తున్నది కుమారి ఆంటీ కావటంతో సీన్లోకి సీఎం వచ్చేశారు.

ముఖ్యమంత్రిని కలిసి.. ఆయనకు తమకు తోచిన సాయాన్ని ఇస్తున్న వైనానికి ముఖ్యమంత్రి సైతం స్పందించి ఆమెను అభినందించారు. కష్టంలో ఉన్న ప్రజలకు తన వంతు సాయంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కుమారి ఆంటీకి మరోసారి నెటిజన్లు అండగా నిలిచారు. ఆమె నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి వెళ్లి మరీ.. సాయాన్ని అందించిన ఆమెను ప్రశంసిస్తున్న వైనంతో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారారు.