తారక్ అభయంతో అభిమాని ఆనందం

తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ రెండు పదుల వయసులో కూడా లేని స్థితిలో క్యాన్సర్ బారిన పడి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా తమ కుమారుడిని బ్రతికించాలని, చనిపోయేలోపు దేవర చూడాలని కోరుకుంటున్నాడని అతని తల్లితండ్రులు కన్నీళ్లు పెడుతూ చేసిన వీడియో అందరినీ కదిలించింది.

ఇది ఎలాగైనా తారక్ కు చేరాలని వేల సంఖ్యలో రీ ట్వీట్లు ట్యాగ్ లు చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా ప్రాణాంతక వ్యాధికి గురై చివరి రోజుల్లో కూడా ఇష్టమైన హీరోని తలచుకోవడం హృదయాలను మెలిపెట్టింది.

దీనికి జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. తిరుపతి నుంచి అభిమాన సంఘాల ప్రతినిధులను బెంగళూరు పంపించి వీడియో కాల్ ద్వారా కౌశిక్ తో సుమారు పది నిమిషాల పాటు ముచ్చటించాడు.

ముందు ఆరోగ్యం జాగ్రత్తని, సినిమాలు తర్వాత ముందు సంతోషంగా ఉంటే అన్ని అవే సర్దుకుంటాయని ధైర్యం చెప్పాడు. కౌశిక్ తల్లితో మాట్లాడుతూ మీరు బాధ పడితే అబ్బాయి ఇంకా కలవరానికి గురవుతాడని, నవ్వుతు ఉంటేనే త్వరగా కోలుకోవచ్చని ధైర్యం చెప్పాడు. తప్పకుండ సహాయం చేస్తానని, కౌశిక్ మాములు మనిషయ్యాక వ్యక్తిగతంగా కలుసుకుందామని హామీ ఇచ్చాడు.

ఇలాంటి అభయం ఈ సమయంలో కౌశిక్ కి చాలా అవసరం. తెలుగు హీరోలను అభిమానులు ఏ స్థాయిలో ప్రేమిస్తారో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. అంత దిగులులోనూ తారక్ ని వీడియోలో చూడగానే కౌశిక్ మొహం వేయి బల్బుల వెలుగుతో కనిపించింది.

జీవితంకన్నా ఏదీ ముఖ్యం కాదు కాబట్టి తల్లడిల్లిపోతున్న ఆ అమ్మ ఘోష తగ్గడానికైనా కొడుకు త్వరగా బయటికి రావాలి. రిలీజ్ నాటికి అతను ఇంకా ఆసుపత్రిలోనే ఉంటాడు కానీ ఆన్ లైన్, సాటి అభిమానుల ద్వారా తెలుసుకునే సూపర్ హిట్ టాక్ ఖచ్చితంగా అతని ధైర్యాన్ని మరింత పెంచుతుంది. అదే జరగాలని అందరి కోరిక.