సింగల్ స్క్రీన్లకు ముంచుకొస్తున్న ప్రమాదం

అత్యాధునిక సౌకర్యాలు మల్టీప్లెక్సుల్లో ఎన్ని ఉన్నా సింగల్ స్క్రీన్లలో సినిమా చూస్తే దక్కే అనుభూతే వేరు. క్రాస్ రోడ్స్ సుదర్శన్ లో చూస్తే దక్కే కిక్కు పంజాగుట్ట పివిఆర్ అనుభూతి ఇవ్వదనేది ఏ సినీ ప్రియుడైనా ఒప్పుకునే వాస్తవం. కానీ అలాంటి సువిశాలమైన హాళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. క్రమంగా ఉనికిని కోల్పోతూ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని కార్పొరేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.  దేశవ్యాప్తంగా ఒక్క 2023 సంవత్సరంలోనే 650 పైగా సింగల్ స్క్రీన్లు మూతబడి షాపింగ్ కాంప్లెక్స్, కల్యాణ మండపాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా  మారిపోయాయి.

గత దశాబ్దంన్నర కాలంలో ఈ లెక్క 5 వేలకు పైగానే ఉంది. ప్రస్తుతం ఇండియా వైడ్ ఉన్న 9 వేలకు పైగా ఉన్న తెరలలో సింగల్ స్క్రీన్లు అయిదు వేలలోపే ఉన్నాయి. అందులో 70 శాతం దాకా దక్షిణాది రాష్ట్రాల్లోనే మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో ఏపీ, తెలంగాణ, తమిళనాడుదే అగ్ర స్థానం. కేరళ, కర్ణాటకలో చాలా తక్కువ. ఈ ఏడాది పూర్తిగా మల్టీప్లెక్సుల ఆధిపత్యం మొదలైపోయింది. టికెట్ రేట్ తో మొదలుపెట్టి పాప్ కార్న్ దాకా ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిన వీటిలో రెగ్యులర్ గా సినిమాలు చూడటం మధ్య తరగతి జీవులకు అంత సులభం కాదు.

రాబోయే రోజుల్లో ట్రెండ్ ఎలా ఉండబోతోందనే దానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పెద్ద స్థలంలో ఒక థియేటర్ నడపడం కన్నా కాంప్లెక్స్ కట్టి అయిదో ఫ్లోర్ లో స్క్రీన్లు పెట్టి మిగిలిన నాలుగు అంతస్తులు దుకాణాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం కొన్ని పదుల రెట్లు అధికంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక సింగల్ స్క్రీన్ పైన వచ్చే ఆదాయం నెలకు పది లక్షలు అనుకుందాం. అదే షాపింగ్ కాంప్లెక్స్ అయితే కోటికి పైగానే ఎలాంటి రిస్క్ లేకుండా లెక్కబెట్టుకోవచ్చు. ఇలాంటి లెక్కల మధ్య భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. అయినా సింగల్ స్క్రీన్లు నడిపిస్తున్న వాళ్లకు జేజేలు కొట్టాల్సిందే.