కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు. అందుకే ఓ దుకాణం యజమాని తెలుగు లో కూడా బోర్డు పెట్టారు. అక్కడి దుకాణానికి ఉన్న తెలుగు అక్షరాలను తొలగించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. బళ్లారిలో ఆకృతి అనే తెలుగు అక్షరాలను తొలగించడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

కర్ణాటక రక్షణ వేదిక, బళ్లారి, విజయనగర జిల్లా అధ్యక్షుడు జి.రాజశేఖర్‌ రాజన్న ఆధ్వర్యంలో సైన్ బోర్డు నుంచి తొలగించారు. అయితే దానిపై తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు కన్నడిగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కర్ణాటకలో సైన్బోర్డులపై 60 శాతం కన్నడ అక్షరాలు కనపడాలనే ఉత్తర్వులు ఉన్నాయని వారు చెబుతున్నారు. బళ్లారిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 42 శాతం కన్నడ మాట్లాడేవారు, 25 శాతం తెలుగు మాట్లాడేవారు, 24 శాతం ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారు.

అయితే తెలుగు వాళ్లు దీనిని ఖండిస్తున్నారు. ఏపీలోని పలు పట్టణాల్లో కన్నడ బోర్డులు ఉండడాన్ని వారు ఉదాహరణగా చూపుతున్నారు. అనంతపురం, ఆదోనిలోని దుకాణాలపై ఉన్న కన్నడ బోర్డులను, అదే విధంగా తిరుపతి, మంత్రాలయం వద్ద కన్నడ భాషలో ఉన్న అక్షరాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలు అన్ని భాషలను అక్కున చేర్చుకుంటారు. కానీ ఇతర రాష్ట్రాల్లో అవమాన పడాల్సి వస్తోందని వాపోతున్నారు.

కొద్దిరోజుల కిందట కన్నడ భాషపై నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యారు. ఆయన సినిమాను బ్యాన్ చేస్తామంటూ రోడ్డెక్కారు. కోర్టు జోక్యంతో ఆ వివాదం సమసిపోయింది. ఇప్పడు తాజాగా బోర్డుపై తెలుగు పదాలను తొలగించడంతో తెలుగు రాష్ట్రాలలో మళ్లీ చర్చ మొదలైంది.