డార్క్ టూరిజం : కేరళ స్ట్రాంగ్ వార్నింగ్ !

2008 నవంబర్ 26 నుండి 29 వరకు ముంబయి మహానగరంపై మూడు రోజుల పాటు ఉగ్రవాదులు చేసిన దాడుల గురించి అందరికీ తెలిసిందే. ఈ దాడులలో 173 మంది చనిపోగా, మూడు వందల మందికి పైగా గాయపడ్డారు. అయితే అక్కడ దాడుల నేపథ్యంలో కొందరు సినిమా పరిశ్రమకు చెందిన వారు వచ్చి ఆ దృశ్యాలను చిత్రీకరించడం, అక్కడ విషాదం నెలకొన్న సమయంలోనే తాము సినిమా తీస్తామని ప్రకటించడం విమర్శలకు దారి తీసింది.

ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తుతో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలకు గ్రామాలను తుడిచిపెట్టింది. ముండక్కై, చూరాల్ మల ప్రాంతాలలో 65 శాతం ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాలను తొలగిస్తే గానీ చనిపోయిన వారు ఎంత మంది అన్న విషయం తెలిసేలా లేదు.

ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనూ ఆర్మీ, పోలీసు బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా స్థానికులను కాపాడారు. ఈ నేపథ్యంలో డార్క్ టూరిజం మీద కేరళ పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ పరిస్థితులలో అక్కడికి ఎవరైనా రావద్దని మీడియా, సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేస్తున్నారు.

విపత్తులు, యుద్దం, దాడులు, మరణాలు జరిగిన ప్రాంతాలలో పర్యటించి వీడియోలు, ఫోటోలు సేకరించడాన్ని డార్క్ టూరిజం అంటారు. ఇలాంటి వారు ఎవరూ కేరళలో విపత్తు జరిగిన ప్రాంతాలకు రావద్దని స్పష్టం చేశారు. వీరి రాక మూలంగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు ఆటంకం జరుగుతుందని చెబుతున్నారు. సోషల్ మీడియా పరిధి పెరిగిన నేపథ్యంలో అనేక వ్లాగర్లు ఇలాంటి వాటిని కూడా తీసి యూట్యూబ్, ఇన్ స్టా తదితర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తుంటారు. అందుకే అలాంటి వారు రావద్దని పోలీసులు చెబుతున్నారు. మన తెలుగు సామెత ప్రకారం చెప్పాలంటే వీళ్లంతా ‘శవాల మీద పేలాలు ఏరుకునే’ బ్యాచ్ అన్నమాట.