ఐటీ జీవులకు ఊరటనిచ్చేలా హైసియా సర్వే రిపోర్టు

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో చోటు చేసుకున్న పరిణామాలు అన్ని ఇన్ని కావు. ఇంతకాలం ఉద్యోగం చేయాలంటే కచ్ఛితంగా ఆఫీసుకు వెళ్లాలన్న ఉద్యోగాల్ని సైతం.. విపత్తు వేళ ఇంట్లో ఉండే చేసే విధానానికి తెర తీసింది. ఇక.. అప్పుడప్పుడు ఆప్షనల్ గా ఉండే వర్క్ ఫ్రం హోం ఐటీ.. ఐటీయేతర ఉద్యోగాల్లోనూ వచ్చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయన్న విషయంపై హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజస్ అసోసియేషన్ తాజాగా వెల్లడించింది.

వారు చేసిన సర్వే తాలుకూ వివరాల్ని చూసినప్పుడు ఐటీజీవులు హమ్మయ్య అనుకునేలా ఉండటం గమనార్హం. కరోనా నేపథ్యంలో తొలి దశలో ఐటీ.. ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థలకు ఇబ్బందులు కొన్ని ఎదురైనా.. ఇప్పుడు సాధారణ పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. అవాంతరాల్ని అవకాశాలుగా మార్చుకొని ఐటీ సంస్థలు ముందుకు వెళుతున్నట్లుగా సర్వే రిపోర్టు వెల్లడించింది.

కరోనా వచ్చి ఆర్నెల్లు దాటిన వేళ.. పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై ఐసియా ఒక సర్వే నిర్వహించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలుచేస్తున్న ఐటీ ఉద్యోగులు కేవలం ఐదు నుంచి పదిశాతమేనని తేలింది. కంపెనీలు సైతం తమ దగ్గర పని చేసే ఉద్యోగుల్లో 90 శాతం ఇంటి దగ్గర నుంచి పని చేయించుకోవటానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు తేలింది.

పెద్ద పెద్ద కంపెనీలు మాత్రం వచ్చే ఏడాది మార్చి నాటికి తమ ఉద్యోగుల్లో 30 శాతం మందిని ఇంటి నుంచి ఆఫీసుకు తెప్పించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు వెల్లడైంది. దాదాపు 80 శాతం సంస్థలు తమ ఉద్యోగుల్లో 75 నుంచి 90 శాతం మందికి ఇంటి నుంచి పని చేసే సామర్థ్యం ఉందన్న విషయాన్ని గుర్తించారట. కొద్దిమంది మాత్రం ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తేల్చారు.

విద్యుత్ అంతరాయం.. నెట్ వర్క్ సరిగా లేకపోవటం.. పని వాతావరణానికి ఇల్లు అనువుగా లేకపోవటం లాంటి వాటితో కాన్ఫరెన్స్ ల్లో పాల్గొనలేకపోయినట్లు వెల్లడైంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గడిచిన ఆర్నెల్ల కాలంలో కొన్ని పెద్ద కంపెనీలు కొత్త ఉద్యోగుల్ని కూడా నియమించుకున్నాయి. గతంలో పోలిస్తే.. ఈ నియామకాలు తక్కువే అయినా.. గతంలో తాము కాలేజీ క్యాంపస్ లలో ఎంపిక చేసిన వారికి ఆఫర్లు ఇచ్చినట్లుగా పేర్కొన్నాయి. ప్రత్యేకంగా ఉద్యోగుల్ని తీసేసిన కంపెనీలు లేవన్న మాటను ఈ సర్వే చెప్పింది.

గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే. కంపెనీల ఆదాయాలు తగ్గటం ఖాయమని తేల్చారు. దాదాపు 64 శాతానికి చెందిన కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చాలా సంస్థలు తమ ఆఫీసు స్పేస్ ను దాదాపు 25 శాతం తగ్గించుకున్నాయని తేలింది. పెద్ద కంపెనీలు మినహాయించి.. చాలావరకు కంపెనీలు తమ పని ప్రదేశాన్ని కుదించుకునే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు ఐసియా ప్రతినిధులు చెబుతున్నారు.