జియో కొత్త ప్లాన్స్.. మీమ్స్ మోత

భారతీయ ఇంటర్నెట్ రంగంలో జియో తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంబీల్లో డేటాను కూడా వందల రూపాయలు పెట్టి కొంటున్న రోజుల్లో అదే వందల రూపాయలకు రోజూ ఒక జీబీ ఇంటర్నెట్ అందించిన ఘనత జియోకే చెందుతుంది. మొదట్లో ఉచిత ఆఫర్లు, చీప్ రేట్లతో జియో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా దేశంలో పదుల కోట్ల మంది జియో వైపు మళ్లారు. మొబైల్ ఇంటర్నెట్ వాడే వాళ్లలో చాలామంది వేరే నెట్‌వర్క్ వదిలిపెట్టి జియోకు మళ్లగా.. వేరే నెట్‌వర్క్ వాడుతూ కూడా అదనంగా జియో సిమ్ తీసుకున్న వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ఈ దెబ్బకు మిగతా నెట్‌వర్క్స్ అన్నీ కూడా డేటా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. మొత్తంగా దేశంలో ఇంటర్నెట్ ఎక్కువమందికి అందుబాటులోకి రావడంలో, చౌకగా మారడంలో జియో కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.

ఐతే అంబానీల వ్యాపార సూత్రం ఏంటంటే.. వినియోగదారులకు ముందు ఏదైనా చౌకగా అందించి దానికి బాగా అలవాటు చేస్తారని.. అలా అలవాటు పడ్డాక ధరలు పెంచి సొమ్ము చేసుకుంటారని పేరుంది. జియో విషయంలో కూడా ఇదే జరుగుతుందని వ్యాపార వర్గాలు ముందే అంచనా వేశాయి. ఆ అంచనా ప్రకారమే తర్వాత పరిణామాలు జరిగాయి. క్రమ క్రమంగా డేటా ధరలు పెంచుతూ వచ్చిన జియో.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. వార్షిక ప్లాన్‌లో ఒకేసారి 600 ధర పెంచింది. మిగతా ప్లాన్లకూ ధరలు మారాయి. ఈ మేరకు ప్రకటన రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో మీమ్స్ మోత మోగింది.

ముకేశ్ అంబానీ ముందు ఎలా ఆఫర్లు ఇస్తాడు.. తర్వాత ఎలా డబ్బులు లాగేస్తాడో చూపిస్తూ పెద్ద ఎత్తున మీమ్స్ వస్తున్నాయి. తన కొడుకు నిశ్చితార్థం సందర్భంగా అంబానీ తినుబండారాలు వడ్డించిన వీడియోలో దృశ్యాలను రివర్స్ చేసి చూపిస్తూ.. జనాలకు చౌకగా జియోను అందించి దానికి అలవాటు చేశాక ఎలా రేట్లు పెంచి డబ్బులు లాగుతున్నాడో వివరిస్తూ రెడీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి మరెన్నో మీమ్స్, జోక్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.