కల్తీ సారా 29 మందిని మింగేసింది

80, 90 దశకాల్లో కల్తీ సారా తాలూకు దారుణాల గురించి తరచుగా వార్తలు వినేవాళ్లం. మద్యం చాలినంత స్థాయిలో జనాలకు అందక, లేదా ఆంక్షల వల్ల అప్పట్లో కల్తీ సారా తాగి జనాలు ప్రాణాలు కోల్పోయేవాళ్లు. కానీ ఇప్పుడు దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో మద్యం ఏరులై పోరుతోంది. చీప్ లిక్కర్ దగ్గర్నుంచి టాప్ బ్రాండ్స్ వరకు అన్ని రకాల మద్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఇలాంటి రోజుల్లో కల్తీ సారా తాగి 29 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాట తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగి 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముందుగా అందులో ఆరుగురు చనిపోయారు. తర్వాత ఆసుపత్రి పాలైన వాళ్లలో ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోవడం మొదలైంది.

మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి గురువారం ఉదయానికి 29కి చేరుకుంది. మిగతా వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంటున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో చికిత్స జరుగుతున్న ఆసుపత్రి ప్రాంగణం దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. మృతులు, ఇతర బాధితులు స్థానికంగా తయారయ్యే సారా తాగి అస్వస్థతకు గురయ్యారు.

మద్యం తాగి కింద పడి దొర్లుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్‌పై బదిలీ వేటు వేయగా.. ఎస్పీ సమయసింగ్ మీనా మీద సస్పెన్షన్ విధించారు.