జాన్వీ కపూర్ కొత్త సినిమా మెప్పించిందా

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ 16తో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ కొత్త బాలీవుడ్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహీ నిన్న విడుదలయ్యింది. ఓపెనింగ్ డే దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు దక్కడం చూసి ట్రేడ్ సంతోషం వ్యక్తం చేసింది. అదేంటి దీనికంత హైప్ ఉందాని ఆశ్చర్యపోకండి. సినీ లవర్స్ డేని పురస్కరించుకుని మల్టీప్లెక్సులు కేవలం 99 రూపాయల టికెట్ రేట్ పెట్టడం వల్ల రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా కోసమే ఏళ్ళ తరబడి క్రికెట్ నేర్చుకున్నానని జాన్వీ కపూర్ చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికంత కంటెంట్ ఉందో లేదో చూద్దాం.

ఒకరకంగా చెప్పాలంటే ఇది నాని జెర్సీలో అర్జున్ పాత్రను భార్యాభర్తలుగా రెండు భాగాలు చేస్తే ఎలా ఉంటుందోననే ఆలోచనతో పుట్టింది. క్రికెటర్ గా సక్సెస్ కాలేక జీవితంలో వెనుకబడిన మహేంద్ర(రాజ్ కుమార్ రావు) ఇష్టం లేకపోయినా తండ్రి నడిపే స్పోర్ట్స్ దుకాణం బాధ్యత తీసుకుంటాడు. ఆయన మాట మేరకే ఇష్టం లేకపోయినా డాక్టర్ మహిమ (జాన్వీ కపూర్) ని పెళ్లి చేసుకుంటాడు. పేరుకి వైద్యురాలే అయినా మహిమకి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. ఇది గుర్తించిన మహేందర్ తన కలను ఆమె ద్వారా నెరవేర్చుకోవడానికి నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత జరిగేది సులభంగా ఊహించొచ్చు.

దర్శకుడు శరణ్ శర్మ తీసుకున్న కథలో ఏమంత వైవిధ్యం లేదు. గతంలో చూసిన ఫీలింగే కలుగుతుంది. ముందే ఊహించేలా కథనం సాగడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా డ్రామా నడిపించడంలో అతను సక్సెస్ కాలేదు. మదర్ సెంటిమెంట్ తప్ప అధిక శాతం ఎపిసోడ్లు చప్పగా సాగుతాయి. క్లైమాక్స్ మ్యాచులో మహిమ సులభంగా సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించే విధానాన్ని ఉద్వేగం కలిగేలా తీయలేదు. జాన్వీ, రాజ్ కుమార్ నటన ఎంత బాగున్నప్పటికీ వీక్ కంటెంట్ వల్ల ఎంగేజింగ్ మూవీలో భాగం కాలేకపోయారు. బోలెడు ఓపిక, తీరిక ఉంటేనే మిస్టర్ అండ్ మిసెస్ మహీని భరించగలం.