మ‌స్క్ హెచ్చ‌రించిన రోజే.. మోడీ షాక్!

ఎలాన్ మ‌స్క్‌.. టెస్లా అధినేత‌. ట్విట్ట‌ర్‌(ఎక్స్‌) అధినేత. తాజాగా ఆయ‌న “వివా టెక్‌” పేరిట నిర్వహించిన స్టార్టప్‌ సదస్సులో మాట్లాడుతూ.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజ‌న్స్‌.. ఏఐతో ఉద్యోగాల‌కు ముప్పు ఉంద‌ని హెచ్చ‌రించారు. సాధార‌ణ ఉద్యోగుల స్థానంలో టెక్ కంపెనీలు ఏఐ ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటున్నాయ‌ని చెప్పారు. ఇవి వ‌స్తే.. సాధారణ ఉద్యోగులు ఇక‌, టైం పాస్‌ చేయ‌డ‌మేన‌ని చెప్పారు. అయితే.. ఈ విష‌యంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయ‌ని.. ప్ర‌మాద‌క‌ర‌మైన రంగాల‌కు ఏఐ ఉద్యోగుల‌ను వినియోగించ‌డం త‌ప్పుకాద‌న్న అభిప్రాయం ఉంద‌ని చెప్పారు.

స‌రే.. ఒక‌వైపు ఉద్యోగాల విష‌యంలో పెను ప్ర‌మాదం తీసుకువ‌స్తున్న ఏఐ విష‌యంలో ప్ర‌పంచం ఒక‌వైపు ఆలోచ‌న చేస్తుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భార‌త ప్ర‌భుత్వ రంగంలో ఉన్న ఓ కీల‌క వార్తా సంస్థ‌లో ఉద్యోగుల స్థానంలో ఏఐ ఉద్యోగుల‌ను నియ‌మించ‌డం.. సంచ‌ల‌నంగానే కాకుండా.. వివాదానికి కూడా దారి తీసింది. ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌ట్టిన ఈ వ్య‌వ‌హారం క‌నుక స‌క్సెస్ అయితే.. ఇక‌, మున్ముందు అన్ని రంగాల్లోనూ ఏఐ ఉద్యోగుల‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వ రంగంలోని దూర‌ద‌ర్శ‌న్(డీడీ) వార్తా చానాళ్ల‌కు ఆద‌ర‌ణ ఉన్న విష‌యం తెలిసిందే. మొత్తం 22 ర‌కాల చానెళ్లు దూర‌ద‌ర్శ‌న్ కింద ప్ర‌సారం అవుతున్నాయి. వీటిలో వార్తా చానెళ్లు, ఎంట‌ర్‌టైన్ మెంట్‌, స్పోర్ట్స్‌, ప్రాంతీయ చానెళ్లు ఇలా.. చాలా ర‌కాల చానెళ్లు ఉన్నాయి. వీటిని రాబోయే రోజుల్లో ఏఐ ఉద్యోగుల‌తో నింపేయాల‌న్న‌ది.. మోడీ స‌ర్కారు ప్లాన్‌. దీనిలో భాగంగా ప్ర‌స్తుతం ‘డీడీ కిసాన్‌’ విభాగంలో ఇద్ద‌రు ఏఐ యాంక‌ర్ల‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. వీరే వార్త‌లు చ‌ద‌వ‌నున్నారు.

ఎప్పుడు ప్రారంభ‌మైంది..?

రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానెల్ ‘డిడి కిసాన్’ మే 26తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా దూరదర్శన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. న్యూస్ రీడింగ్ కోసం ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో దేశంలో ఏఐ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్ ఇదే అవుతుందని స‌ర్కారు తెలిపింది. కానీ, వాస్త‌వానికి ఉద్యోగాల‌కు పెద్ద ఎఫెక్ట్ అని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఎలా ప‌నిచేస్తాయి?

ఈ యాంకర్లు ఏఐ కనెక్టెడ్ కంప్యూటర్లు. ఇవి కూడా మనుషుల్లాగే పనిచేస్తాయి. ఈ ఏఐ యాంకర్లు వ్యవసాయ రంగ పరిశోధనలు, మార్కెట్‌లో ధరలు, ప్రభుత్వ పథకాలు… అలాగే వాతావరణ సమస్యలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందజేస్తారు..ఈ ఏఐ యాంకర్లు 50 భాషల్లో మాట్లాడగలరని డీడీ కిసాన్ వెల్లడించింది.