టీఎస్ కాదు.. టీజీఎస్.. ఆర్టీసీనే.. వినియోగ‌దారుల్లో ఆగ్ర‌హం!

తెలంగాణ ప్ర‌భుత్వం స‌రికొత్త మార్పుల దిశ‌గా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ప‌దేళ్ల బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పోయి.. కాంగ్రెస్ వ‌చ్చిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో కొన్ని కొన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను సమూలంగా మార్చుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ త‌ల్లి.. విగ్ర‌హంలోనూ కొన్ని మార్పులు చేశారు. ఇక‌, తెలంగాణ స్టేట్‌(టీఎస్‌)ను కాస్తా.. తెలంగాణ(టీజీ) చేశారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా.. ఈ నెల 15న నివేదిక పంపించి.. గెజిట్‌లోనూ పేర్కొన్నారు.

అంటే.. ఇక నుంచి తెలంగాణ అంతే! ఇదిలావుంటే.. ఇప్పుడు మ‌రో విధానం కూడా అమలు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు టీఎస్ ఆర్టీసీగాఉన్న ర‌వాణా వాహ‌నాల‌ను కూడా.. ‘టీజీ ఎస్‌ ఆర్టీసీ’గా మారుస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇక‌, నుంచి అన్ని బ‌స్సుల‌పైనా టీజీగా మార్పు చేయాల‌ని సూచించింది.అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్ స్టాండ్ల‌పై కూడా.. మార్పులు చేయాల‌ని ఆదేశాలు జారీచేసింది.

ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలోని ఆర్టీఏ సంస్థ‌ల‌కు కూడా ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు చేసింది. వాహ‌నాల రిజిస్ట్రేష‌న్‌లో టీఎస్‌కు బదులుగా టీజీ రాయాల‌ని పేర్కొంది. ఈ నెల 15 నుంచే ఈ ఆదేశాలు పాటించాలని పేర్కొంది. మ‌రోవైపు.. ఇప్ప‌టికే టీఎస్‌గా రిజిస్ట్రేష‌న్ అయిన వాహ‌నాలు.. టీజీగా మార్పు చేసుకోవాలని.. నెంబ‌ర్ ప్లేట్ల నుంచి రిజిస్ట్రేష‌న్ , డ్రైవింగ్ లైసెన్సులు ఇలా.. అన్నీ మార్పులు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

అయితే.. ఈ మార్పుపై.. కొంత సానుకూలత‌.. కొంత వ్య‌తిరేక‌త కూడా వ‌స్తోంది. దీనికి చాలానే డ‌బ్బులు కావాల‌ని.. ఈ మార్పును ప్ర‌భుత్వం ఉచితంగా చేసి ఇవ్వాల‌ని.. వాహ‌నదారులు కోరుతున్నారు. ఆర్టీసీలోనూ ఇదే చ‌ర్చ‌సాగుతోంది. ఆర్టీసి ఇప్ప‌టికే అప్పుల్లో ఉంద‌ని.. ఇప్పుడు వాహ‌న ప్లేట్లు, బ‌స్ స్టాండ్ల మార్పు అంటే.. కోట్ల‌లో ఖ‌ర్చు అవుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.