ఒంగోలులో ‘టచ్ చేసి చూడు’ అంటున్న పోలీసులు !

రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ వేశం వేసి రంగంలోకి దించుతాడు. అల్లరిమూకలు చుట్టూ ఉన్నది తమ వారు అనుకొని విధ్వంసానికి సిద్దం అవగానే రౌడీల డ్రస్సులో ఉన్న పోలీసులు తమ పైన ధరించిన డ్రస్సులను చించివేసి పోలీసు డ్రస్సులతో రౌడీ మూకలను చితకబాది వారి ప్రణాళికను భగ్నం చేస్తారు.

ఒంగోలులో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌ కూడలిలో అల్లరిమూకలు ఒక్కసారిగా బస్టాండ్ సెంటర్‌లోకి దూసుకొచ్చారు. కౌంటింగ్‌లో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పోలీస్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని అల్లరి మూకలను కట్టడి చేసేందుకు తొలుత హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జి చేశారు. ఈ సందర్బంగా పోలీసులపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. పెట్రోల్ బాంబులు కూడా విసిరారు. దీంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

అనంతరం వాటర్‌ క్యానన్‌లతో ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్‌ చేశారు. ఈ ఫైరింగ్‌లో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కొంతమంది రోడ్డుపై పడిపోయారు. గాయాలపాలైన వారిని వెంటనే పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం గొడవ సద్దుమణిగింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్లో 20 నిమిషాలపాటు రణరంగాన్ని తలపించిన ఈ తతంగాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.

ఒంగోలు పోలీసులు అమలు చేసిన టచ్ చేసి చూడు సినిమా ప్లాన్ ను పోలీసులు అమలుచేశారు. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు, రేపు జూన్ 4 ఫలితాల తర్వాత అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు పోలీసులు ఆడిన ఈ నాటకం స్థానికులలో ఉత్కంఠ రేపింది.

కౌంటిగ్ రోజున ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకునే యాక్షన్‌లో భాగంగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్లు ప్రకాశంజిల్లా ఎస్‌పి గరుడ్ సుమిత్‌ సునీల్‌ తెలిపారు. కౌంటింగ్‌ సమయంలో, ఆ తరువాత ఎవరైనా అల్లరి మూకలు ఆందోళనలకు దిగితే పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించడం గమనార్హం.