ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన ఈ ఘటనకు సంబంధించిన ప్రతి విషయం ఏదో ఒక సంధర్బంలో ప్రముఖ వార్త అవుతున్నది.

 అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. టైటానిక్ షిప్ లో ప్రయాణించి, మరణించిన వారిలో అమెరికాకు చెందిన సంపన్నుడు జాన్ జేకబ్ ఆస్టర్ కూడా ఒకరు. భార్య మెడిలీన్ తో కలసి ఆయన టైటానిక్ లో ప్రయాణించారు. భార్యను వేరే బోట్ ఎక్కించి కాపాడి ఆయన మరణించారు.

ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత ఆయన మృతదేహంతో పాటు ఆయన ధరించిన బంగారు వాచ్ ను అప్పగించారు. ఆ తర్వాత ఆ వాచ్ రిపేర్ చేయించి పనిచేసేలా చేశారు. దానిని కొన్నాళ్లు అస్టర్ కుమారుడు ధరించాడు.

ఆ బంగారు వాచ్ ను తాజాగా ఇంగ్లాండ్ లో వేలం వేశారు.  దానికి  రికార్డు స్థాయిలో ధర పలికింది. వేలంలో లక్ష పౌండ్ల నుంచి లక్షన్నర పౌండ్ల వరకు అంటే సుమారు రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకు రావొచ్చని నిర్వాహకులు అంచనా వేశారు.

అయితే ఏకంగా 1.46 మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ. 12.17 కోట్లకు అమ్ముడుపోయిందని వాచ్ ను వేలం వేసిన సంస్థ హెన్రీ ఆల్డ్ రిడ్జ్ అండ్ సన్ ఈ విషయాన్ని తెలిపింది. టైటానిక్ కు చెందిన వస్తువులన్నింటిలో ఇదే అత్యంత ధర పలకడం విశేషం. అమెరికాకు చెందిన వ్యక్తి దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం.