పార్టీ సభ్యుడి కామెంట్లపై త్రిష సీరియస్

ఆ మధ్య సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ లియో సినిమాలో త్రిషతో నటించడం గురించి అభ్యంతరకరమైన కామెంట్లు చేసి దుమారం రేపడం చూశాం. ఆమెకు మద్దతుగా మాట్లాడినందుకు చిరంజీవి, ఖుష్భూ తదితరుల మీద కేసు పెట్టి కోర్టు చేత చీవాట్లు తిన్న ఘనత కూడా ఇతనికే చెల్లింది. అభిమానులతో సహా ఈ విషయంలో ప్రేక్షకులందరూ త్రిషకు పూర్తి మద్దతు తెలిపారు.  పొన్నియిన్ సెల్వన్ నుంచి వరస అవకాశాలతో త్రిష బిజీగా మారింది. చిరంజీవి, కమల్ హాసన్, అజిత్ లాంటి అగ్ర హీరోలతో ప్యాన్ ఇండియా మూవీస్ లో భాగమవుతోంది. అందుకే కొందరు ఓర్వలేకపోతున్నారు.

తాజాగా తమిళనాడు ఏఐఐడిఎంకె పార్టీకి చెందిన ఏవి రాజు అనే మాజీ నాయకుడు త్రిష మీద నోరు పారేసుకోవడం కలకలం రేపుతోంది. భారీ మొత్తంలో సొమ్ము ముట్టజెప్పడం గురించి మాట్లాడుతూ ఆమె గురించి అనవసరంగా కామెంట్ చేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు భగ్గుమంటున్నాయి. అతను ఏం చెప్పాడనేది వివరించలేనంత అసహ్యంగా ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత దిగజారుడుగా వ్యవహరించాడో. ఈ వివాదంపై త్రిష ట్విట్టర్ వేదికగా భగ్గుమంది. మనుషులు ఇంత దిగజారి ప్రవర్తిస్తారని ఎప్పుడూ అనుకోలేదని, చట్టపరమైన చర్యలకు వెళ్తున్నట్టు చెప్పింది.

ఇలాంటి వాళ్ళు మంత్రులైనా ఆర్టిస్టులైనా ఎవరైనా సరే తీవ్రమైన శిక్ష పడితే తప్ప ఈ ప్రహసనం ఆగేలా లేదు. కేవలం కాంట్రావర్సి ద్వారా పాపులర్ అయ్యేందుకు వేస్తున్న ఎత్తుగడల్లో ఇది భాగంగా కనిపిస్తోంది. సదరు ఏవి రాజు గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడట. అయినా బుద్ది రాకపోవడం విచారకరం. అయినా పదే పదే త్రిషని లక్ష్యంగా పెట్టుకోవడం పట్ల అభిమానులు కలత చెందుతున్నారు. కెరీర్ చక్కగా ఉన్న టైంలో ఇలా రాళ్లు ఎందుకు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సిగ్గు మానం లేని రాజు లాంటి వ్యక్తులు అవన్నీ ఆలోచిస్తారా.