శివ‌శివా.. శ్రీశైలం ప్ర‌సాదంలో చికెన్ ముక్క‌లు!

శ్రీశైలం. హిందువులు అత్యంత ప‌ర‌మ ప‌విత్రంగా భావించే కాశీ విశ్వ‌నాథుని మందిరం త‌ర్వాత‌.. ప్లేస్ దీనిదే. “సంధ్యారంభ విజృంభితం.. ” అంటూ.. ప‌ర‌మేశ్వ‌రుడు.. ప్ర‌తి రోజూ సంధ్యాకాలంలో శ్రీశైల గిరుల‌పై తాండవం చేస్తార‌ని ప్ర‌తీతి. ఇదే విష‌యాన్ని శంక‌రాచార్యుల వారు శివానంద‌ల‌హ‌రిలోనూ పేర్కొన్నారు. అలాంటి ప‌ర‌మ‌ప‌విత్ర క్షేత్రాన్ని జీవితంలో ఒక్క‌సారైనా ద‌ర్శించుకోవాల‌ని హిందువుల ప‌రిత‌పిస్తుంటారు. ఏడాదిలో ప్ర‌తి రోజూ ఏదో ఒక కార్య‌క్ర‌మంతో ఇక్క‌డ నిత్య క‌ళ్యాణం అన్న‌ట్టుగా శివ‌య్య‌కు పూజ‌లు జ‌రుగుతుంటాయి.

ఇటీవ‌ల కాలంలో భ‌క్తుల సంఖ్య కూడా వేల నుంచి ల‌క్ష‌ల‌కు చేరింది. ఇలాంటి ప‌ర‌మ‌ప‌విత్ర క్షేత్రంలో తాజాగా వెలుగు చూసిన ఘ‌ట‌న అంద‌రినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. శ్రీశైలంలో ప్ర‌తి రోజూ విక్ర‌యించే పులిహోర ప్ర‌సాదంలో చికెన్ ముక్క‌లు రావ‌డం తీవ్ర‌స్థాయిలో క‌ల‌క‌లం రేపింది. హైద‌రాబాద్ కు చెందిన హరీష్ రెడ్డి త‌న కుటుంబంతో క‌లిసి శ్రీశైలానికి వ‌చ్చారు. శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశారు.

ప్ర‌సాదాన్ని క‌ళ్ల‌కు అద్దుకుని నోట్లో వేసుకోబోతుండ‌గా.. చేతికి గ‌ట్టి ఎముక వంటి ప‌దార్ధం గుచ్చుకుంది. దీంతో ఏంటా అని చూడగా అందులో చికెన్ ఎముక‌లు క‌నిపించాయి. ఎంతో నిష్ఠగా తయారయ్యే పులిహోర ప్రసాదంలో చికెన్ ఎముక‌లు రావ‌డంతో భ‌క్తుడు తీవ్ర ఆవేద‌న‌కు, ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. దేవస్థానం అధికారులకు పులిహోర‌లో వ‌చ్చిన ఎముక ముక్క‌లు చూపించారు. అంతేకాదు.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

సాక్షాత్తూ శివుడు వ‌చ్చి తాండ‌వ‌మాడే ఆల‌యంలో ఇంత అపచారం చేస్తారా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. పులిహోరలో చికెన్ ఎముక‌ల‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం కూడాసీరియ‌స్ అయింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారుల‌ను కూడా ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల‌కు ముందు ఇది ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగిందా.? అసలు శ్రీశైలంపై చికెన్ రావ‌డం ఏంటి? అనే కోణంలో అధికారులు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.