63 మంది ఖైదీల‌కు ఎయిడ్స్‌.. దేశంలో క‌ల‌క‌లం!

అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌, క‌నీసం చీమ‌ను కూడా బ‌య‌ట నుంచి రానివ్వ‌ని అత్యంత దుర్భేద్యంగా ఉండే జైల్లో ఏకంగా 63 మంది ఖైదీల‌కు ఎయిడ్స్ నిర్ధార‌ణ అయింది. వీరిని తాజాగా ప‌రీక్షించిన ప్ర‌త్యేక‌వైద్యులు వారిలో హైఐవీ వైర‌స్ పాజిటివిటీ ఉన్న‌ట్టుగా గుర్తించారు. దీంతో జైలు అదికారులే కాదు.. ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఉలిక్కి ప‌డింది. వెంట‌నే ఉన్న‌త‌స్థాయి విచార‌ణ‌కు ఆదేశించ‌డంతోపాటు జైల‌ర్‌పై చ‌ర్య‌లకు కూడా ఆదేశాలు చేసింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌ధాని ల‌క్కోలో ఉన్న కేంద్ర కారాగారంలో చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఎలా సోకింది?

వాస్త‌వానికి గ‌త ఏడాది.. సెప్టెంబ‌రులో జైల్లోనే ఒక ఖైదీ అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందాడు. దీంతో మృత దేహానికి పోస్టు మార్టం నిర్వ‌హించిన‌ప్పుడు తొలిసారి ఎయిడ్స్ నిర్ధార‌ణ అయింది. దీనిని గుట్టు చ‌ప్పుడు కాకుండా.. అధికారులు తొక్కి పెట్టి.. అనంత‌రం… జైల్లోని ఇత‌ర ఖైదీల‌కు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ ప‌రీక్ష‌ల్లో అంద‌రూ ఆశ్చ‌ర్య పోయేలా.. 36 మందికి వైర‌స్ సోకిన‌ట్టు గుర్తించారు. త‌ర్వాత‌.. కిట్స్ కొర‌త కార‌ణంగా ప‌రీక్ష‌లు ఆపేశారు. ఇప్పుడు గ‌త వారంలో ఓ రోగికి తీవ్ర‌ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. మొత్తం 63 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.

దీనిపై జైలు అధికారులు చెబుతున్న వాద‌న వింత‌గా ఉంది. ప్ర‌స్తుతం ఎయిడ్స్ సోకిన 63 మంది రోగులు.. మ‌ద్యం, సిగ‌రెట్లు, ఇత‌ర‌త్రా అల‌వాట్ల‌కు బానిస‌ల‌ని.. అందుకే వారికి ఎయిడ్స్ సోకింద‌ని అంటున్నారు. పైగా..వీరు జైల్లోకి వ‌చ్చే ముందే.. ఎయిడ్స్ ల‌క్ష‌ణాల‌తో వ‌చ్చార‌ని తెలిపారు. జైలు ప్రాంగణం వెలుపల కలుషితమైన సిరంజీలను ఉపయోగించడం వల్లే ఈ ఖైదీలు వైరస్‌కు గురయ్యారని తెలిపారు. కానీ, వైద్యుల వాద‌న మరోలా ఉంది. మ‌ద‌క ద్ర‌వ్యాలు, లేదా మ‌ద్యం , సిగ‌రెట్ల‌కు బానిస అయిన వారిలో ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయ వ్యాధులు మాత్ర‌మే వ‌స్తాయ‌ని ఇలా.. ఎయిడ్స్ సోకే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

ఇదిలావుంటే.. ఈ పరిస్థితిపై రాజ‌కీయ దుమారం రేగ‌క‌ముందే.. యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం ఎయిడ్స్ సోకిన‌ ఖైదీలకు లక్నోలోని ఓ ఆసుపత్రిలో ర‌హ‌స్య చికిత్స ప్రారంభించిన‌ట్టు స్థానిక మీడియా తెలిపింది. హెచ్ఐవీ సోకిన ఖైదీల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. ఎలాంటి మరణాలు సంభవించకపోవ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని.. అధికార పార్టీ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మొత్తానికి జైళ్ల‌లోనూ ఎయిడ్స్ సోక‌డం ప‌ట్ల‌.. దేశ‌వ్యాప్తంగా జైళ్ల‌లో ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.