సన్ రైజర్స్.. ఇది తగునా?

ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ స్థానంలోకి వచ్చిన సన్ రైజర్స్ జట్టుకు మొదట్లో పెద్దగా ఫాలోయింగ్ ఉండేది కాదు. ఇటు లోకల్ ఫీలింగ్ తో హైదరాబాదీలను ఆకర్షించలేక, అటు స్టార్ ఆటగాళ్ల కళ తీసుకురాలేక కొన్నేళ్లపాటు బాగా ఇబ్బంది పడింది ఆ ఫ్రాంచైజీ. కొన్ని సీజన్ల పాటు ఆ జట్టు ఆట కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఫాలోయింగ్ పెరగలేదు. అలాంటి స్థితిలో ఓ ఆటగాడు ఆ జట్టు రాత మారడంలో కీలక పాత్ర పోషించాడు. అతనే డేవిడ్ వార్నర్.

సన్ రైజర్స్ ఆట క్రమంగా మెరుగుపడి ఆ జట్టు 2016లో టైటిల్ గెలిచిందన్నా.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిందన్నా.. ఆ జట్టు విలువ అమాంతం పెరిగిందన్నా అందులో వార్నర్ పాత్ర అత్యంత కీలకం. అలాంటి ఆటగాడిని కాస్త ఫామ్ కోల్పోగానే కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాక తుది జట్టు నుంచి కూడా పక్కన పెట్టి ఘోరంగా అవమానించింది సన్ రైజర్స్. చివరికి అతన్ని మొత్తంగా జట్టు నుంచే బయటికి పంపించేసింది.

వార్నర్ ఎప్పుడైతే బయటకి వెళ్ళాడో దాంతో పాటే సన్రైజర్స్ వైభవం కూడా పోయింది. అప్పటినుంచి ప్రదర్శన మరింత పడిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా వరకు తగ్గుతూ వచ్చింది. వార్నర్ వెళ్ళిపోయినప్పటి నుంచి హైదరాబాదీలు కూడా సన్ రైజర్స్ జట్టును ఓన్ చేసుకోవట్లేదు. సన్ రైజర్స్ కోసం ఎంతో చేసిన వార్నర్ విషయంలో ఫ్రాంచైజీ యాజమాన్యం వ్యవహరించిన తీరు అభిమానులకు మింగుడు పడలేదు.

అయితే వార్నర్ విషయంలో ఇప్పటిదాకా చేసింది సరిపోదని.. ఇప్పుడు మరోసారి అమర్యాదకరంగా వ్యవహరించి సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది సన్ రైజర్స్. తాజాగా 2024 ఐపీఎల్ సీజన్ కోసం వేలం జరగగా.. తన ఆస్ట్రేలియా సహచరుడు ట్రావిస్ హెడ్ సన్ రైజర్స్ జట్టుతో చేరిన నేపథ్యంలో ఆ ఫ్రాంచేజీని ట్యాగ్ చేయాలని వార్నర్ ప్రయత్నించగా తనను ట్విట్టర్ సహా సోషల్ మీడియా ఖాతాల్లో బ్లాక్ చేసిన విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను వార్నర్ షేర్ చేశాడు. అయితే ఇలా బ్లాక్ చేయాల్సినంత తప్పు వార్నర్ ఏం చేశాడు అని నెటిజన్లు సన్ రైజర్స్ ఫ్రాంచైజీని ప్రశ్నిస్తున్నారు.

తన పట్ల అవమాన కరంగా వ్యవహరించినప్పటికీ ఇప్పటిదాకా ఆ ఫ్రాంఛైజీని వార్నర్ ఒక్క మాట అనలేదు. ఎలాంటి విమర్శలు చేయలేదు. జట్టు కోసం ఎంతో చేసి, తనను తప్పించాక కూడా ఎంతో హుందాగా వ్యవహరించినా ఆటగాడిని ఇలా బ్లాక్ చేసి తన సంకుచితత్వాన్ని సన్ రైజర్స్ చాటుకుందంటూ ఆ ఫ్రాంచైజీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.