మైనర్ బాలికల అండాలతో నయా ధందా

పాశ్చాత్య దేశాల నుంచి సరోగసి సంస్కృతి మనదేశంలోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సంతానం లేని దంపతులకు చట్ట ప్రకారం కొన్ని నిబంధనలతో సరోగసికి అనుమతి ఉంది. అయితే, కొందరు నిబంధనలను ఉల్లంఘించి అద్దె గర్భాన్ని అమ్ముకుంటున్న వైనంపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం పొందాలనుకుంటున్న దంపతులను టార్గెట్ చేస్తూ కొత్త ధందా మొదలైంది. సంతానం లేని దంపతులకు మైనర్ బాలికల అండాలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది.

పేద కుటుంబాలకు చెందిన బాలికలకు డబ్బులు ఎరవేసి ఈ చర్యలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఐవీఎఫ్ సెంటర్లకు వచ్చే జంటలను ఈ ముఠా టార్గెట్ చేసింది. 15-17 ఏళ్ల వయసున్న మైనర్ బాలికల అండాలను వారికి విక్రయిస్తోంది. డబ్బులు అవసరం ఉన్న పేదింటి బాలికలను టార్గెట్ చేసుకొని వారి వయసుకు సంబంధించిన నకిలీ పత్రాలను ఈ ముఠా సృష్టిస్తోంది . ఒక మైనర్ బాలిక నుంచి అండాలు సేకరించి 30 వేలు ఇస్తామని ఆశ చూపి 11,500 చెల్లించడంతో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో, ఆ ముఠా గుట్టు రట్టయింది.

ఈ క్రమంలోనే ఆ ఘటనపై దర్యాప్తు జరిపిన వారణాసి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఐవీఎఫ్ ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లకు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం అండం దానం చేసే మహిళ వయస్సు 23 ఏళ్లు దాటాలి. అంతేకాదు, ఆమెకు వివాహమై మూడేళ్ల వయసు దాటిన బిడ్డ ఉండాలి. ఇక, ఒక మహిళ జీవితంలో ఒకసారి మాత్రమే అండదానం చేసేందుకు అర్హురాలు.