రోహిత్ టాస్ ఫిక్సింగ్..ఖండించిన వసీం అక్రమ్

అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్, బాల్ ట్యాంపరింగ్ వంటి వివాదాలకు కొదవలేదు. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ భట్ కొత్తగా టాస్ ట్యాంపరింగ్ అనే సరికొత్త వివాదానికి భాష్యం చెప్పారు. అది కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ టాంపరింగ్ కు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. టాస్ సందర్భంగా రోహిత్ శర్మ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని భట్ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపాయి. టాస్ సమయంలో నాణేన్ని రోహిత్ శర్మ దూరంగా విసురుతున్నాడని ఆరోపించాడు.

ప్రత్యర్థి కెప్టెన్లు ఆ నాణెం బొమ్మా?బొరుసా? చూసే వీలు లేకుండా కాయిన్ దూరంగా పడుతోందని, ఈ లోపు ఐసీసీ అధికారులు బొమ్మో, బొరుసో చెప్పేస్తున్నారని ఆరోపించాడు. టాస్ పర్యవేక్షించే ఐసిసి అధికారులను కూడా రోహిత్ శర్మ మేనేజ్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలోనే భట్ కామెంట్లపై పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందించాడు. భట్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని, టాస్ వేసిన కాయిన్ కచ్చితంగా ఎంత దూరం పడాలి అని ఎవరూ చెప్పలేరని అన్నారు.

ఆ నాణెం వేగాన్ని బట్టి దూరం వెళుతుందని చెప్పుకొచ్చారు. స్పాన్సర్షిప్ కోసం ఉపయోగించే మ్యాట్ పై టాస్ వేసిన నాణెం పడుతుందని, ఇటువంటి చెత్త కామెంట్లు వినలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇటువంటి వ్యాఖ్యలపై స్పందించడం కూడా అనవసరమని వసీం అక్రం అన్నారు. ఇక, పాక్ మాజీ కెప్టెన్లు మొయీన్ ఖాన్, షోయబ్ మాలిక్ కూడా భట్ వ్యాఖ్యలను ఖండించారు. ఒక్కొక్క కెప్టెన్ ఒక్కో విధానంలో టాస్ వేస్తారని, దానిపై చర్చించడం దండగని షోయబ్ మాలిక్ అన్నాడు.

సెమిస్ చేరకుండానే పేలవ ప్రదర్శనతో తమ జట్టు ఇంటి ముఖం పట్టడంతో పాక్ మాజీ ఆటగాళ్లు నోటికి వచ్చినట్లుగా వివాదాస్పద ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఆరోపణలు చేయడానికి బదులు తమ జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేలా మాట్లాడడం, వారి ఆట తీరు మెరుగుపడేలా తమ అనుభవాన్ని ఉపయోగించి సలహాలు సూచనలు ఇవ్వడం చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.