57 ఏళ్ల మ‌హిళ‌.. ‘ఆంటీ’ అన్నాడ‌ని చిత‌క‌బాది కేసు పెట్టింది!

సాధార‌ణంగా ఒకింత వ‌య‌సు మ‌ళ్లిన వారిని ఆంటీ అని సంబోధించ‌డం.. నాగ‌రిక‌త‌కు చిహ్నంగా భావిస్తున్న రోజులివి!. పైగా కొంద‌రు.. 50 ఏళ్లు దాటిన‌ మ‌హిళ‌లు త‌మ వ‌య‌సును గుర్తించ‌కుండా ఇలా పిలిస్తే.. ఆనందించేవారు కూడా ఉన్నారు. అయితే .. ఇలా పిలిచార‌న్న కార‌ణంగా ఓ మ‌హిళ‌కు కోపం న‌షాళానికి ఎక్కింది. ఆంటీ అని పిలుస్తావా భ‌డ‌వా! అంటూ.. నిప్పులు చెరిగింది. అంతేకాదు.. చెంప‌లు రెండూ వాయించి పోలీసు కేసు కూడా పెట్టింది. మొత్తానికి ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.

త‌మిళ‌నాడుకు చెందిన నిర్మ‌లాదేవి వ‌య‌సు 57 ఏళ్లు. ఆమె తాజాగా చెన్నైలోని మెట్రోపాలిట‌న్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేష‌న్ బ‌స్సులో మింట్ నుంచి రెడ్ హిల్స్‌కు వెళ్లేందుకు బ‌స్సు ఎక్కారు. ఈ స‌మ‌యంలో కండెక్ట‌ర్ ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి.. “ఎక్క‌డికి వెళ్తున్నారు ఆంటీ” అని సంబోధించారు. అంతేకాదు.. “టికెట్‌కు స‌రిప‌డా చిల్ల‌ర ఇవ్వండి ఆంటీ” అని ప‌దే ప‌దే బిగ్గ‌ర‌గా అరిచాడు. అంతే.. కోపం న‌షాళానికి ఎక్కిన నిర్మ‌లాదేవి.. “న‌న్ను ఆంటీ అని పిల‌వొద్దు” అని చెప్పారు. అయితే.. జ‌నం ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆమె చెప్పింది వినబ‌డ‌ని.. కండెక్ట‌ర్ మూడో సారి కూడా ఆంటీ అని సంబోధించారు.

అంతే! ఒక్క ఉదుటున సీటు లోంచి లేచిన నిర్మ‌లా దేవి.. కండెక్ట‌ర్ రెండు చెంప‌లూ వాయించేసింది. అంతేకాదు.. అక్క‌డితో కూడా ఆమె ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు. వెంట‌నే ఈ విష‌యాన్ని త‌న భ‌ర్త‌కు ఫోన్‌లో చేర‌వేసింది. రెడ్ హిల్స్ ద‌గ్గ‌ర ఆమె బ‌స్సు దిగే స‌మ‌యానికి భ‌ర్త కూడా అక్క‌డ‌కు చేరుకున్నాడు. ఆ వెంట‌నే ఆయ‌న కూడా కండెక్ట‌ర్‌కు రెండు త‌గిలించ‌డంతోపాటు.. స్థానిక పోలీసు స్టేష‌న్‌లో మ‌హిళా వేధింపుల సెక్ష‌న్ కింద కేసు పెట్టారు. త‌న గౌర‌వానికి భంగం క‌లిగించాడ‌ని.. కండెక్ట‌ర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు కండెక్ట‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోనే కాకుండా.. క్ష‌ణాల్లో దేశ‌వ్యాప్తంగా పాకింది. కండెక్ట‌ర్ ప‌ట్ల జాలి.. నిర్మ‌లాదేవి ప‌ట్ల ఆగ్ర‌హం.. స‌మ‌పాళ్ల‌లో వ్య‌క్త‌మైంది.