పిల్ల‌ల్ని క‌నండి.. చైనా గ‌గ్గోలు!!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌న చైనాగా ఉన్న డ్రాగ‌న్ కంట్రీ.. ఇప్పుడు జ‌నాభా సంఖ్య ఎంతున్నా ఫ‌ర్లేదు.. పిల్లల్ని క‌నండి అంటూ ఇంటింటి ప్ర‌చారం ప్రారంభించింది. అంతేకాదు.. గ‌ర్భ నిరోధ‌కాల్లో ఒక‌టైన‌ కండోమ్‌ల విక్ర‌యంపై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. మ‌రి దీనికి కార‌ణాలేంటి? చైనా స‌ర్కారు హ‌ఠాత్తుగా ఇంత క‌టిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది.

వాస్తవానికి ఈ ఏడాది ఆరంభం వ‌రకు కూడా చైనానే ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశం. ఈ ర్యాంకు ను భార‌త్ కొట్టేసింది. ఇప్పుడు 140 కోట్ల పైచిలుకు జ‌నాభాతో భార‌త్ ముందంజ‌లో ఉంది. అయితే.. చైనా ఇప్పుడు కొన్నాళ్లుగా అక్క‌డి పౌరుల‌ను పిల్ల‌ల్ని కనండి అంటూ.. గ‌గ్గోలు పెడుతోంది. దీనికి కార‌ణం.. జ‌నాభా విష‌యంలో భార‌త దేశం త‌మ‌ను దాటేసినందుకు కాదు.. భ‌విష్య‌త్తును త‌లుచుకుంటే గుండె క‌రిగి పోతున్నందుకేన‌ట‌.

ఔను. అత్య‌ధిక జ‌నాభా ఉన్న కార‌ణంగా గ‌తంలో చైనా పాల‌కులు తీసుకున్న కొన్నినిర్ణ‌యాలు.. జ‌నాభా సంఖ్య‌ను భారీగా క‌ట్ట‌డి చేశాయి. 1980 నుంచి 2015 దాకా ఆ దేశంలో పెళ్లయిన జంటలు ఒక బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేసింది. దీంతో జనాభా అసమతుల్యత పెరిగిపోయింది. ఈ విష‌యం తెలియగానే ఒక బిడ్డ‌ విధానానికి చైనా స్వస్తి పలికింది.

ఈ క్ర‌మంలోనే జనాభా రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కొత్తగా పిల్లల ను కనేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించింది. అయినా ప్రస్తుతానికైతే పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. మ‌రోవైపు.. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. 2040 నాటికి చైనాలో 65 శాతం మంది వృద్ధులే ఉండ‌నున్నార‌ని తాజాగా స‌ర్కారు లెక్క‌లు వేసింది. ఇదే జ‌రిగితే.. త‌మ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ త‌ల‌కిందులు కావ‌డంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా చైనా ప‌రిస్థితి డోలాయ‌మానంలోనూ ప‌డ‌నుంది.

దీంతో యువత సంఖ్య‌ను 2040 నాటికి పెంచే కీల‌క చ‌ర్య‌ల‌కు చైనా ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. ఒక‌ప్పుడు ఒక్క బిడ్డే అన్న ప్ర‌భుత్వం ఇప్పుడు ఎంత మందినైనా క‌నండి అంటూ బిగ్ ఆఫ‌ర్ ఇచ్చింది. అంతేకాదు.. కొత్త పెళ్ల‌యిన వారికి పిల్ల‌లు క‌నడంపై కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఉద్యోగులు అయితే.. భారీగా సెల‌వులు కూడా ఇస్తున్నారు. ఇక‌, గ‌ర్భ నిరోధ‌కాల్లో ఒక‌టైన కండోమ్‌ల వినియోగంపై ఉక్కుపాదం మోపారు. వాటిని కొనుగోలు చేయాలంటే డాక్ట‌ర్ అనుమ‌తి ఉండాల‌ని తాజాగా స‌ర్కారు నిబంధ‌న విధించింది. మొత్తంగా.. చైనాలో ఇప్పుడు బిడ్డుల‌ను క‌న‌డంపై స‌ర్కారు ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌డం ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది.