ప్రపంచకప్ ఆటగాడు.. హాస్పిటల్ బెడ్డుపై

శుభ్‌మన్ గిల్.. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు కీలకం అవుతాడనుకున్న ఆటగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ‌తో కలిసి అతనే చాలా రోజులుగా వన్డేల్లో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తున్నాడు. నిలకడగా రాణిస్తూ, భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ అతను అభిమానుల మనసు గెలిచాడు. కెరీర్లో తక్కువ వ్యవధిలోనే అతను డబుల్ సెంచరీ ఘనతను కూడా అందుకున్నాడు. ప్రపంచకప్‌లో అతడి మీద జట్టు, అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ దురదృష్టం అతణ్ని వెంటాడింది.

ప్రపంచకప్ ఆరంభం కాబోతుండగా.. అతను అనారోగ్యం పాలయ్యాడు. జ్వరం వస్తే ఒకట్రెండు రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడనుకున్నారు. కానీ అది మామూలు జ్వరం కాదని, డెంగీ అని తర్వాత తేలింది. దీంతో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడలేకపోయాడు. బుధవారం అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌కూ దూరమయ్యాడు.

కనీసం శనివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కైనా అందుబాటులోకి వస్తాడేమో అనుకుంటే అలాంటి సంకేతాలే కనిపించడం లేదు. డెంగీ తీవ్రత పెరిగి.. అతడికి ప్లేట్‌లెట్స్ కూడా తగ్గిపోయాయి. ఓవైపు చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత జట్టంతా ఢిల్లీకి వెళ్లిపోతే.. శుభ్‌మన్ మాత్రం ఆ సిటీలోనే ఉండిపోయాడు. ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో శుభ్‌మన్‌ను ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో ఉంటే డెంగీ అంత ప్రమాదకరం కాదు కానీ.. కోలుకోవడానికి మాత్రం సమయం పడుతుంది.

ప్రపంచకప్‌లో జట్టుతో పాటు ఉండాల్సిన వాడు.. ఇలా ఆసుపత్రి బెడ్డు మీదికి వెళ్లడం పట్ల అభిమానులు అయ్యో అనుకుంటున్నారు. డెంగీ తీవ్రత దృష్ట్యా శుభ్‌మన్‌కు ప్రత్యామ్నాయాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. గిల్ కోలుకోవడం ఆలస్యం అయితే రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్‌లో ఒకరిని జట్టులోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తోందట బీసీసీఐ.