హైదరాబాద్ లో రూ.1.26 కోట్లు పలికిన గణపతి లడ్డూ

నిమజ్జనం వేళ.. ప్రసాదంగా ఉంచిన గణపతి లడ్డూను వేలం వేయడం తెలిసిందే. పోటాపోటీగా సాగే ఈ లడ్డూ వేలంలో రికార్డు ధరలు ఎప్పటికప్పుడు నమోదు అవుతుంటాయి. హైదరాబాద్ మొత్తంలో రికార్డు స్థాయిలో ధర పలికే లడ్డూ వేలానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది బాలాపూర్ లడ్డూ వేలం. అయితే.. ఆ ధరల్ని సైతం బీట్ చేసేలా ఒక విల్లా వెంచర్ లో చోటు చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బాలాపూర్ లడ్డూ వేలం అంటే అక్కడో ఊరు.. ఎన్నో ఏళ్ల నుంచి వేలం నడుస్తుండటం.. అక్కడి లడ్డూను సొంతం చేసుకుంటే బాగా కలిసి వస్తుందన్న నమ్మకంతో పాటు.. భారీగా ఉండే రియల్ ఎస్టేట్ కారణంతో ధర పలకటాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా బండ్లగూడ జాగీర్ పరిధిలోని ఒక విల్లా వెంచర్ లో పరిమిత సంఖ్యలో ఉండే వెంచర్ సభ్యుల మధ్య జరిగిన వేలంలో రూ.1.26 కోట్ల భారీ ధర పలకటం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. ఇంతకూ ఆ విల్లా ప్రాజెక్టు పేరేమిటంటారా? అక్కడికే వస్తున్నాం. కీర్తి రిచ్మండ్ విల్లా. ఇందులో పలువురు పారిశ్రామికవేత్తలు.. వ్యాపారవేత్తలతో పాటు.. పలువురు సీనియర్ అధికారులు ఉంటారని చెబుతారు.

ఇక్కడి లడ్డూ వేలం గురించి సదరు విల్లాకు చెందిన వారు తాజాగా ప్రకటన చేశారు. లడ్డూ వేలం అందరూ కలిసి పాడతారని.. ఇప్పుడు పలికిన మొత్తాన్ని రకరకాల ఎన్జీవోలకు.. కమ్యూనిటీ సర్వీసులకు వినియోగిస్తామని చెబుతున్నారు. గత ఏడాది ఇక్కడ జరిగిన లడ్డూ వేలంలో రూ.60.8 లక్షలు పలకగా.. ఈసారి అందుకు రెండు రెట్లు పెరగటం ఆసక్తికరంగా మారింది. 2021లో ఇక్కడి లడ్డూ వేలంలో రూ.41 లక్షలకు పలకటంతో.. రిచ్మండ్ విల్లా మీద అందరి చూపు పడింది.

ఇక.. హైటెక్ సిటీలో విలాసవంతంగా ఉంటుందని చెప్పే మైహోం భూజా లోనూ గణపతి లడ్డూ వేలాన్ని నిర్వహించారు. ఇక్కడ కూడా లడ్డూను రూ.25.5 లక్షలకు పాట పాడి సొంతం చేసుకున్నారు. ఒక కంపెనీ ఎండీ లక్షలు పోసి మరీ వేలంలో లడ్డూను సొంతం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. సాగర్ రోడ్డు లోని టీఎన్ ఆర్ సులోచన అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని లడ్డూ వేలం రూ.10.3 లక్షలకు వెళ్లటం గమనార్హం. ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జనాలు నిర్వహిస్తున్ననేపథ్యంలో లడ్డూ వేలాలకు సంబంధించి మరెన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.