ఏపీలో హై అల‌ర్ట్‌… నిలిచిన ఆర్టీసీ.. స్వ‌చ్ఛంద బంద్‌

ఏపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టు ద‌రిమిలా.. రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్కారు అప్ర‌క‌టిత హై అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ఆర్టీసీ బ‌స్సులు నిలిచిపోయా యి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేతకు ప్ర‌భుత్వం అప్ర‌క‌టిత ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలిసింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అన్ని డిపోల్లోనూ ఆర్టీసీ బ‌స్సులు నిలిచిపోయాయి.

దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. విశాఖలో ప్రయాణికులను దించి మరీ బ‌స్సుల‌ను సంబంధిత‌ డిపోలకు తరలించారు. అదేస‌మయంలో ప్ర‌యాణికుల‌కు టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చారు. కొన్ని డిపోల్లో అయితే.. ఈ రోజు ఉద‌యం నుంచి సిటీ బస్సులు కూడా రోడ్డెక్క లేదు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని పోలీసులు చెబుతున్నారు.

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అన్ని బస్సులను నిలిపివేయగా, విజయవాడలో సిటీ బస్సులు కూడా రోడ్డుపైకి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, విద్యాసంస్థ‌ల‌కు కూడా సెల‌వు ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. అయితే, బ్యాంకులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు య‌థావిధిగా ప‌నిచేస్తాయ‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. బ‌స్సుల‌పై టీడీపీ కార్య‌క‌ర్త‌లు దాడులు చేసే అవ‌కాశం ఉంద‌న్న ముంద‌స్తు స‌మాచారంతోనే వాటిని నిలుపుద‌ల చేశామ‌ని.. ప‌రిస్థితిని బ‌ట్టి వాటిని న‌డిపే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని పోలీసులు తెలిపారు.