సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు? హింట్ ఇదే

ఈ మధ్యకాలంలో పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న వైనం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, విడాకులు తీసుకోవడానికి ముందు కొందరు సెలబ్రిటీ కపుల్స్ ఒక కొత్త ట్రెండ్ కి తెర తీశారు. మరికొద్ది రోజుల్లో విడాకులు తీసుకుబోతున్నాం అన్న హింట్ ఇస్తూ తమ సోషల్ మీడియా ఖాతాలలో తమ పార్ట్నర్ కు సంబంధించిన వివరాలను తొలగించడం ఈ మధ్యకాలంలో ట్రెండ్ గా మారింది. అక్కినేని నాగచైతన్య-సమంత, మెగా డాక్టర్ నిహారిక- చైతన్యల వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే వచ్చింది. తాజాగా, ఈ కోవలోకి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ జంట రాబోతుందని టాక్ వస్తోంది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో నుంచి సానియా మీర్జాకు సంబంధించిన ఒక అప్డేట్ ని షోయబ్ మాలిక్ తీసివేయడం చర్చకు దారి తీసింది. గతంలో సానియా మీర్జా భర్త అని ఉండగా…దానికి బదులు ఒక బిడ్డకు తండ్రిని అని పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొంతకాలంగా వీరిద్దరి విడాకులపై వస్తున్న పుకార్లకు తాజా ఘటన ఊతమిచ్చినట్లయింది. కొద్ది నెలలుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. అయితే, తామిద్దరం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని, అందుకే ఇటువంటి పుకార్లు వస్తున్నాయని మాలిక్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

అంతేకాదు తామద్దరం కలిసి ఉన్న ఒక ఫోటోను కూడా కొద్దిరోజుల క్రితం మాలిక్ ఇన్స్టా లో షేర్ చేశాడు. మరి, ఈ జంట విషయంలో విడాకుల పుకారు పుకారుగానే మిగిలిపోతుందా లేదంటే మిగతా సెలబ్రిటీల మాదిరిగానే ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతుందా అన్నది తేలాల్సి ఉంది.