విండీస్ తో వన్డే సిరీస్ కైవసం…పాండ్యా అసంతృప్తి

వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో టీమిండియా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో టీమిండియా సత్తా చాటి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో దుమ్మురేపిన భారత బ్యాట్స్ మన్లు 352 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచారు. గిల్ 85 పరుగులు, ఇషాన్ కిషన్ 77 పరులుగు, పాండ్యా 70 పరుగులు, సంజూ శాంసన్ అర్థ సెంచరీతో రాణించారు. భారీ లక్ష చేదనలో కరీబియన్ బ్యాట్స్ మన్లు తడబడడంతో ఆ జట్టు 151 పరుగులకే కుప్పకూలింది.

మూడో వన్డేలో గెలుపుతో టీమిండియా పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో 200 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ పై భారత్ కు ఇది రెండో అతిపెద్ద విజయం. ఇక, కరీబియన్ జట్టుపై భారత్ కు ఇది వరుసగా 13వ సిరీస్ విజయం కావడం విశేషం. 2007-23 మధ్య ఈ ఘనతను భారత్ సాధించింది. మరోవైపు, 143 పరుగుల తొలి వికెట్ రికార్డు భాగస్వామ్యాన్ని ఇషాన్ కిషన్- గిల్ నెలకొల్పారు. విండీస్ పై భారత్ కు ఇదే అత్యుత్తమ తొలి వికెట్ భాగస్వామ్యం. రేపటి నుంచి విండీస్ తో 5 టీ 20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది.

కాగా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తీరుపై టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన విమర్శలు గుప్పించారు. తమకు కనీస వసతులు కల్పించడంలో విండీస్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ విఫలమైందని షాకింగ్ ఆరోపణలు చేశాడు. అయితే, తమకు లగ్జరీ స్థాయిలో సౌకర్యాలు అందించాలని అడగడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ టూర్ లో మిగిలిన రోజులకైనా తమకు కనీస వసతులు, సౌకర్యాలు కల్పించాలని కోరాడు. ముఖ్యంగా ప్రయాణాలు, రవాణా, వాహనాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి అని అసంతృప్తిని వెళ్లగక్కాడు. మరి, పాండ్యా కామెంట్లపై విండీస్ బోర్డు స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.