జీహెచ్ఎంసీ ఆఫీసులో పామును వదిలిన యువకుడు

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో ప్రజలు పని చేయించుకోవడం అనేది ఒక పెద్ద ప్రహసనం. తమ ప్రాంతంలో ఈ సమస్య ఉంది మహాప్రభు అంటూ విన్నపాల మీద విన్నపాలు చేసుకుంటే సంబంధిత అధికారులలో మెజారిటీ అధికారులు, సిబ్బంది తమకు కుదిరినప్పుడు లేదా తీరికగా ఉన్నప్పుడు వచ్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవారు. ముఖ్యంగా మున్సిపాలిటీకి చెందిన అధికారులు, సిబ్బంది అయితే డ్రైనేజీ సమస్య, చెత్తను శుభ్రం చేయడం వంటి పనుల్లో చాలాసార్లు అలసత్వం ప్రదర్శిస్తుంటారు అన్న విమర్శ ఉంది. సిబ్బంది కొరత వలన లేక వేరే చోట సిబ్బంది పనిచేస్తూ ఉండటం వలన కొన్నిసార్లు ప్రజలు అసౌకర్యానికి గురైన సందర్భాలూ ఉన్నాయి.

అయితే, మెజార్టీ సందర్భాల్లో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం వహించడం, స్పందించడంలో తాత్సారం చేయడం వంటి ఘటనలే ఎక్కువగా ఉంటాయి. గతంలో అయితే ఫిర్యాదు చేసి సిబ్బంది వచ్చేవరకు ప్రజలు వేచి చూసేవారు. కానీ, ఈ సోషల్ మీడియా జమానాలో హైటెక్ యువత యాక్టివ్ గా ఉంటున్న తరుణంలో ట్రెండ్ మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో జిహెచ్ఎంసి సిబ్బందికి ఓ యువకుడు షాకిచ్చాడు. ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా స్పందన లేకపోవడంతో ఆ యువకుడు చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది వరద నీటితో పాటు తన ఇంట్లోకి పాము వచ్చిందని కంప్లైంట్ ఇచ్చి ఆరు గంటలు దాటిన సిబ్బంది స్పందించలేదని దీంతో ఆయకుడు ఏకంగా ఆ పామును తీసుకువచ్చి జిహెచ్ఎంసి ఆఫీసులో వదిలిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

హైదరాబాద్ లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్వాల్ ప్రాంతంలో సంపత్ కుమార్ అనే యువకుడు ఇంట్లో వరద నీటితో పాటు ఓ పాము కూడా వచ్చింది. ఈ విషయంపై జిహెచ్ఎంసి అధికారులకు సంపత్ ఫిర్యాదు చేశాడు. అయితే, ఫిర్యాదు చేసి ఆరు గంటలు గడిచినా జిహెచ్ఎంసి అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో, ఓపిక నశించిన సంపత్ కుమార్ అల్వాల్ జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీసుకు వెళ్లి ఆ పామును అక్కడ టేబుల్ మీద వదిలాడు. అధికారుల అలసత్వానికి, నిర్లక్ష్యానికి ఈ రకంగా సంపత్ కుమార్ నిరసన తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.