విషాదం నింపిన విహార యాత్ర‌.. అమెరికాలో అద్దంకి వ్య‌క్తి మృతి..

రాక రాక ఒక సెల‌వు దొరికింది. దీంతో కుటుంబంతో స‌హా ఎంజాయ్ చేయాల‌ని భావించిన ఆ ఇంటి పెద్ద.. త‌న పిల్ల‌లు, స‌తీమ‌ణితో క‌లిసి బీచ్ వెళ్లాడు. అయితే.. ఈ విహార‌మే.. ఆ ఇంట విషాదాన్ని నింపింది. బీచ్‌లో గెంతులు వేస్తున్న త‌న బిడ్డ‌లు.. క‌ళ్ల‌ముందు.. నీట మునిగిపోతున్న తీరును చూసి త‌ట్టుకోలేక పోయింది ఆ తండ్రి హృద‌యం. ఈ క్ర‌మంలో వారిని కాపాడేందుకు చేసిన ప్ర‌య‌త్నంలో ఆయ‌న కూడా నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

ఏం జ‌రిగింది?

ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన పొట్టి వెంకట రాజేష్ కుమార్(42) అనే వ్యక్తి అమెరికాలోని ఓ స్టార్టప్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఫ్లోరిడాలోని బ్రిడ్జ్ 7 వాటర్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. అమెరికా ఇండిపెండెన్స్ డేను పుర‌స్క‌రించుకుని(జూలై 4) సుదీర్ఘ సెలవులు ప్ర‌క‌టించారు. దీంతో రాజేష్ కుటుంబంతో కలిసి సెల‌వుల్లో ఎంజాయ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుని బయటకు వెళ్లాడు.

ఈ క్ర‌మంలో రాజేష్ కుమార్‌ తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే బీచ్‌కి వెళ్లారు. అక్క‌డ ఎంచ‌క్కా ఆడి పాడి.. మ‌ధ్య‌లో లంచ్ చేసి.. ఇంటికి రావాల‌ని అనుకున్నారు. అయితే.. బీచ్‌లోకి దిగిన‌ పిల్లలు సముద్రంలోకి వెళ్లడాన్ని రాజేష్ గమనించాడు. దీంతో అతను వారి వెనుకే పరిగెత్తి తన కొడుకును రక్షించాడు. అయితే, ఇంత‌లోనే పెద్ద కెరటం వచ్చి రాజేష్‌ని లోపలికి లాగింది. దీంతో రాజేష్ స‌ముద్రంలో మునిగిపోయాడు. ఈ ఘ‌ట‌న ఆదివారం తెల్ల‌వారుజామున 4.30 గంటలకు జ‌రిగింది.

ఘ‌ట‌న విష‌యం తెలిసి వెంట‌నే హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. ఊపిరితి త్తుల్లో నీరు చేరడంతో రాజేష్ మృతి చెందాడు. అయితే.. ఆయ‌న కుమారుడు షాక్ ట్రీట్‌మెంట్‌కు స్పందించాడు. ప్రస్తుతం ఐసియులో కోలుకుంటున్నాడు. ఈ మేర‌కు రాజేష్ సోద‌రుడు విజయ్ మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించాడు.

విదేశాంగ శాఖ‌కు చంద్ర‌బాబు లేఖ‌

రాజేష్ ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పందించారు. రాజేష్ కుమార్ మృత దేహాన్ని భార‌త్‌కు తిరిగి తీసుకురావడానికి సహాయం చేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు. రాజేష్‌ కుటుంబ సభ్యులకు కూడా సహాయం అందించారు. అదేవిధంగా మృత దేహాన్ని స్వదే శానికి రప్పించడానికి బాధితుడి పాస్‌పోర్ట్ నంబర్, సంప్రదింపుల‌ వివరాలను విదేశాంగ శాఖ‌కు అప్ప‌గించారు.