హైదరాబాద్‌కు.. పాకిస్థాన్ మ్యాచ్‌లు విదిల్చారు

ఏ రకంగా చూసినా దేశంలో అత్యంత ప్రాధాన్యమున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ అభిమానుల క్రికెట్ పిచ్చి గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా స్టేడియం నిండిపోతుంది. స్టేడియంలోనే కాక బయట కూడా క్రికెటర్లకు ఇక్కడి అభిమానులు బ్రహ్మరథం పడతారు. బీసీసీఐకి బోలెడంత ఆదాయం తెచ్చిపెడతారు. అలాంటి అభిమానుల మీద, సిటీ మీద బీసీసీఐకి ఎప్పుడూ చులకనభావమే.

హైదరాబాద్ క్రికెట్ సంఘం అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతుండటం వల్ల కావచ్చు.. అందులో బలమైన నాయకులు లేక కావచ్చు.. మ్యాచ్‌ల కేటాయింపులో ఎప్పుడూ అన్యాయమే జరుగుతున్నా స్పందన ఉండదు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే వేదికల్లో ఒకటిగా హైదరాబాద్ ఉందని సంతోషించేలోపే.. ఇండియా మ్యాచ్ ఒక్కటీ లేకుండా ఈ సిటీ మీద శీతకన్నేశారు.

ముందు నుంచి ప్రచారంలో ఉన్న విషయాన్నే నిజం చేస్తూ ఈ రోజు ప్రకటించిన ప్రపంచకప్ షెడ్యూల్లో ఇండియా మ్యాచ్‌ ఒక్కటీ హైదరాబాద్‌కు కేటాయించలేదు. మన పొరుగు నగరాలే అయిన బెంగళూరు, చెన్నైలకు మాత్రం ఇండియా మ్యాచ్‌లను కేటాయించారు. ప్రధాని మోడీ సొంత నగరం అహ్మదాబాద్‌లో అయితే ఒక ఇండియా మ్యాచ్‌తో పాటు ఆరంభ మ్యాచ్, ఫైనల్ కూడా జరగబోతున్నాయి.

కానీ హైదరాబాద్‌కు మాత్రం పాకిస్థాన్ ఆడే లీగ్ మ్యాచ్‌లు, న్యూజిలాండ్ మ్యాచ్ ఒకటి కేటాయించి సరిపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్‌ పాకిస్థాన్ జట్టుకు సొంత గడ్డలా అనమాట. ఇండియా ఏదైనా చిన్న జట్టుతో ఆడే మ్యాచ్ కూడా హైదరాబాద్‌కు కేటాయించలేదు. హైదరాబాద్‌తో పోలిస్తే చిన్న నగరాలైన పుణె, ధర్మశాల నగరాలకు సైతం ఇండియా మ్యాచ్‌లు ఉన్నాయి.

మహారాష్ట్రలోనే రెండు ఇండియా మ్యాచ్‌లు జరగబోతున్నాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక్క మ్యాచ్ కూడా కేటాయించలేదు. వైజాగ్‌ అయితే ప్రపంచకప్‌కు వేదికగానే ఎంపిక కాలేదు. అక్టోబరు 5న మొదలయ్యే ప్రపంచకప్.. నవంబరు 19న ఫైనల్‌తో ముగుస్తుంది. ఇండియా-పాకిస్థాన్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ అక్టోబరు 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.