మేడ్చల్ లో రొమాంటిక్ క్రైమ్ స్టోరీ..షాకింగ్

ఈ హైటెక్ జమానాలో రొమాంటిక్ క్రైమ్ కథలు ఎక్కువైపోతున్నాయి. రీల్ లైఫ్ ని చూసి రియల్ లైఫ్ లో స్ఫూర్తి పొందుతున్నారో…లేక రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొంది సినిమాలు చేస్తున్నారో తెలియడం లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు సినిమా స్టోరీలను తలదన్నేలా ఉన్నాయి. తాజాగా, మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ లో జరిగిన ఘటన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ను తలపించేలా ఉంది. ప్రియురాలే తన ప్రియుడిని కిడ్నాప్ చేయించిన ఘటన సంచలనం రేపింది. ఇక, ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక ఆ ప్రియురాలితో పాటుగా ఒక బీజేపీ నేత ఉండడం షాకింగ్ గా మారింది.

మేడ్చల్ కు చెందిన అవినాష్ రెడ్డి, తన క్లాస్ మేట్ అయిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, తనకు డబ్బులు కావాలంటూ ప్రేయసి అడగడంతో భారీ మొత్తంలో అవినాష్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు. అవినాష్ రెడ్డి ఇచ్చిన డబ్బులు వాడుకున్న ప్రియురాలు ఆ తర్వాత అతడిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా, మరో యువకుడితో ఆమె లవ్ స్టోరీ మొదలు పెట్టింది. దీంతో, తనను వాడుకొని వదిలేసిందంటూ ఆమెతో అవినాష్ గొడవపడ్డాడు.

తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని గట్టిగా అడిగాడు. దీంతో, మాజీ ప్రియుడిని వదిలించుకోవాలని చూసిన ఆ యువతి బిజెపి నేత చక్రధర్ గౌడ్ తో కలిసి భారీ స్కెచ్ వేసింది. ఆ యువతి ఫోటోలు, వీడియోలు తొలగించకుంటే డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని చక్రధర్ గౌడ్ బెదిరించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాట్లాడాలంటూ వరంగల్ హైవేపై ఉన్న ఓ హోటల్ కు అవినాష్ ను చక్రధర్ గౌడ్ పిలిపించారు.

ఈ క్రమంలోనే అక్కడ అవినాష్ రెడ్డిని తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసేందుకు చక్రధర్ గౌడ్ ప్రయత్నించారు. అయితే, వారి నుంచి తప్పించుకున్న అవినాష్ రెడ్డి…పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.