రిపోర్ట్ – ఏపీలో కరోనా ఔట్ ఆఫ్ కంట్రోల్

ఏపీలో కరోనా ఔట్ ఆఫ్ కంట్రోల్.. ఇది ప్రతిపక్ష పార్టీలో, జగన్ సర్కారు అంటే గిట్టని వాళ్లో అంటున్న మాట కాదు. కొవిడ్ ఇండియా వెబ్ సైట్ చేసిన హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందంటూ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది ఆ వెబ్ సైట్. దేశంలో కరోనా పరిస్థితిని అంచనా వేస్తూ సమగ్ర వివరాలు అందిస్తున్న అధికారిక వెబ్ సైట్ అది.

ఏపీలో గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకు అటు ఇటుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు 60, 70, 80, 80, 90.. ఇలా పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు సగటున ఒక రోజు మరణాల సంఖ్య వందకు చేరువగా ఉంటుంది. ఎంతకీ కేసులు, మరణాల సంఖ్య తగ్గట్లేదు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ ఇండియా వెబ్ సైట్ ఈ హెచ్చరిక జారీ చేసింది.

ఐదు వేలకు పైగా కరోనా కేసులు నమోదైన 15 రోజుల్లోపే రెట్టింపవుతున్న జిల్లాలు దేశవ్యాప్తంగా 22 మాత్రమే ఉండగా.. అందులో 9 మినహా ఏపీలోనివే అని కొవిడ్ ఇండియా వెబ్ సైట్ చెబుతోంది. ఏపీలో అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలు 20 వేల కేసుల మార్కును దాటేశాయి. విశాఖపట్నం, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలు కూడా 20 వేల కేసుల మార్కుకు చేరువగా ఉన్నాయి. ఆరు జిల్లాల పరిధిలో 7 నుంచి 15 రోజుల వ్యవధిలోనే రెట్టింపు కేసులు నమోదు కావడం గమనార్హం.

జాతీయ స్థాయిలో 28 రోజుల్లో కేసులు రెట్టింపు అవుతుండగా.. ఏపీలో మాత్రం 15 రోజుల్లోపే డబుల్ అవుతున్నాయని కొవిడ్ ఇండియా వెబ్ సైట్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. ఇలాగే కొనసాగితే ఆగస్టు నెలాఖరుకు ఇంకో రెండు లక్షల కేసులు నమోదు కావచ్చని హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.