అప్సర హత్య కేసులో కీలక మలుపు

హైదరాబాద్‌లో సంచలనం రేపిన అప్సర హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సాయికృష్ణ అనే పూజారి ఆమెను హత్య చేసి ఒక మ్యాన్ హోల్‌లో పడేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సాయికృష్ణకు ఆల్రెడీ పెళ్లి అయి పిల్లలు ఉండగా.. అప్సరతో అక్రమ సంబంధం పెట్టుకోవడం.. వీళ్లిద్దరూ కలిసి అనేక ప్రాంతాలకు తిరగడం.. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో అతను ఆమెను చంపేసి మ్యాన్ హోల్‌లో పడేయడం గురించి మీడియాలో వచ్చిన వార్తలు సంచలనం రేపింది.

కాగా తన భర్త అమాయకుడని.. అప్సరనే ఆయన్ని ఒత్తిడి చేసి ఉండొచ్చని.. యాక్సిడెంటల్‌గా ఆమె చనిపోయి ఉండొచ్చని.. సాయికృష్ణ భార్య మీడియా ముందు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అప్సర గురించి రోజుకో వార్త బయటికి వస్తోంది. ఇన్నాళ్లు ఆమె అవివాహిత అనుకున్నారు. కానీ ఆమెకు కార్తీక్ రాజా అనే వ్యక్తితో పెళ్లయినట్లు వెల్లడైంది.

అప్సర పెళ్లి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్సర మొదటి భర్త అయిన తన కుమారుడు ఆమె వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కార్తీక్ రాజా తల్లి మీడియాతో పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ఆడియో రిలీజ్ చేశారు.

‘‘నా కుమారుడ్ని అప్సర మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడు.. పెళ్లైన కొద్దిరోజులకే లగ్జరీగా బతకాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకి గురి చేశారు.. కార్తీక్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు: కార్తీక్ తల్లి. జైలు నుండి బయటకు వచ్చాక కార్తీక్ మానసికంగా కుంగిపోయాడు.. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.. నా కుమారుడి చావుకు అప్సర, తల్లి అరుణనే కారణం.. అప్పటి నుండి వాళ్లిద్దరు కనిపించలేదు.. అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్త చూసి తెలుసుకున్నా: అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. అందుకోసమే అప్సరను తీసుకొని తన తల్లి హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నాను’’ అని కార్తీక్ తల్లి వెల్లడించారు.