50 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి అయిన ప్రభుదేవా

నృత్యదర్శకుడిగా పరిచయం అయి.. ఆపై నటుడిగా మారి.. చివరగా దర్శకుడు కూడా అయ్యాడు ప్రభుదేవా. అన్ని రకాలుగానూ అతను ప్రతిభ చాటుకున్నాడు. ప్రస్తుతం అతను నటుడిగా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే.. డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. అడపాదడపా కొన్ని పాటలకు నృత్యరీతులూ సమకూరుస్తున్నాడు.

ప్రభుదేవా సినీ జీవితం ఎంత ఆసక్తికరమో.. వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తన మొదటి భార్య రమలతకు దూరమై.. నయనతారతో ప్రేమలో పడి ఆమెతో పెళ్లి వరకు వెళ్లడం.. చివరికి వాళ్లిద్దరూ విడిపోవడం సంచలనం రేపిన సండగతి తెలిసిందే. ఆ తర్వాత హిమానీ అనే డాక్టర్ ప్రేమలో పడి 2020లో ఆమెను రహస్యంగా పెళ్లాడాడు ప్రభుదేవా. ఇప్పుడు ఆమె ద్వారా.. 50 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడట ప్రభుదేవా. ఇప్పుడిది కోలీవుడ్లో హాట్ న్యూస్.

రమలత ద్వారా ప్రభుదేవాకు ఇప్పటికే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్లు యుక్త వయసులో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రభుదేవా ఇంటికి ఒక అమ్మాయి అడుగు పెట్టింది. ప్రభుదేవాను పెళ్లాడిన మూడేళ్లకు హిమాని ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. హిమానీతో ప్రభుదేవా ప్రయాణం ఆసక్తికరం. నయన్ నుంచి విడిపోయాక నాలుగైదేళ్ల పాటు ప్రభుదేవా ఒంటరిగానే ఉన్నాడు.

ఆ టైంలో అతడిని వెన్ను నొప్పి వేధించింది. ఒక దశలో నొప్పితో విలవిలలాడుతూ సినిమాలకు పని చేయలేని పరిస్థితికి చేరుకున్నాడు. అప్పుడు అతడికి వైద్యం చేసి నొప్పి తగ్గించిన వైద్యురాలే హిమానీ. ఈ ప్రయాణంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత ప్రేమలో పడ్డారు. కొంత కాలానికి ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. నయన్‌తో ఎఫైర్ టైంలో జరిగిన రభస వల్లో ఏమో.. హిమానీతో ప్రేమాయణం, పెళ్లి విషయాలను ప్రభుదేవా గోప్యంగా ఉంచాడు.