కెనడాలో ఇందిర హత్యపై సంబరాలు.. ఇదేం ఆరాచకం?

ఒక దేశ ప్రధానిని దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రదర్శిస్తూ.. దానికి ప్రతీకారం పేరుతో మరో దేశంలో ర్యాలీ నిర్వహించి.. సంబరాలు చేస్తే దాన్నేమనాలి? ఎలా రియాక్టు కావాలి? హింసను ప్రోత్సహించే వారు.. ఆరాచకాలకు మద్దతు పలికే వారు ఎవరైనా సరే.. తీవ్రంగా ఖండించాల్సిందే. అలాంటి వారిని ఏ మాత్రం ఉపేక్షించకూడదు. కెనడాలో చోటు చేసుకున్న ఒక ఆరాచక ఉదంతం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. దీని వివరాలు తెలిసినంతనే రక్తం మరిగిపోవటమే కాదు.. కెనడాకు గట్టిగా గడ్డి పెట్టాల్సిన అవసరం ఉందన్న భావన కలుగక మానదు. దీనికి పార్టీలకు అతీతంగా దేశ ప్రజలు రియాక్టు అవుతారని చెప్పాలి.

ఇంతకూ జరిగిందేమంటే.. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో 1984లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు జూన్ 6న భారత సైనిక బలగాలు స్వర్ణదేవాలయంలోకి ప్రవేశించాయి. దీనికి ప్రతీకారంగా అదే ఏడాది అక్టోబరు 31న ఇందిరను ఆమె అంగరక్షకులు దారుణంగా కాల్చి చంపారు. ఇది జరిగి 39 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో కెనడాలో అతివాద ఖలిస్థాన్ మద్దతుదారులు సంబరాలు జరిపారు. ఈ వేడుకల్లో భాగంగా.. ఐదు కి.మీ. మేర ర్యాలీని నిర్వహించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. దీన్ని ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా షాక్ కు గురి అవుతున్నారు.

ఇంత హేయమైన రీతిలో రియాక్టు అవుతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి తీవ్రంగా స్పందించి.. చర్యలు తీసుకోవాలని కెనడాను కోరారు. దేశ చరిత్రను గౌరవించాలని.. కెనడా ప్రభుత్వం దీనిపై చర్చించాలని ఆ దేశ విదేశాంగ శాఖను కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్మహ్మణ్యం జైశంకర్ బలంగా కోరారు.

ఈ నెల నాలుగున (నాలుగు రోజుల క్రితం) బ్రాంప్టన్ నగరంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఒక ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శకటం మీద.. ఇందిరను హత్యను ప్రతిబించించేలా బొమ్మను ఏర్పాటు చేశారు. తెల్ల చీరలో ఉన్న ఆమెను..అంగరక్షకులు గన్లతో కాల్పులు జరిపిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా శకటం ఏర్పాటు చేయటం.. దాని వెనుక.. ‘‘ప్రతీకారం’’ అన్న బ్యానర్ ను ఇంగ్లిష్ (రివెంజ్) లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఇది కాస్తా సంచలనంగా మారింది.

ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో క్లిప్ ను బాలరాజ్ డియోల్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ తో పాటు పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా ఒక ట్వీట్ చేస్తూ.. ‘కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఇందిరాగాంధీ హత్యను ప్రదర్శిస్తూ ఐదు కిలోమీటర్ల మేర సాగిన ప్రదర్శన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది ఎవరో ఒకరికి అనుకూలంగా ఉండటం గురించి కాదు. ఒక దేశ చరిత్రను గౌరవించటానికి.. ఆ దేశ ప్రధాని హత్య చేయటంతో కలిగిన బాధ.. ఆవేదనలకు సంబంధించి అంశం. ఈ తీవ్రవాదాన్ని ప్రపంచం ఖండించాలి’’ అని పేర్కొన్నారు.

మిలింద్ వాదనను కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి జైరాం రమేశ్ తీవ్రంగా రియాక్టు అయ్యారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యోదంతాన్ని సంబరంగా చేసుకుంటుంటే చోద్యం చూస్తున్నారా? వెంటనే విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించాలన్నారు. అయితే.. ఈ ఉదంతంపై కేంద్ర మంత్రి జైశంకర్ రియాక్టు అయ్యారు. ఈ పెరేడ్ మీద భారత ప్రభుత్వం తీవ్ర విచారాన్ని.. అసంతృప్తిని వ్యక్తం చేసింది. కెనడా ప్రభుత్వానికి తన ఆగ్రహాన్ని తెలియజేసింది. ఒట్టావాలోని ఇండియన్ హైకమిషన్ బుధవారం గ్లోబల్ అఫైర్స్ కెనడాకు ఒక ఫార్మల్ నోట్ ను పంపింది.

ఈ చర్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమని స్పష్టం చేసింది. వాక్ స్వాంత్య్రం పరిధిని అతిక్రమించకూడదని తెలిపింది. ఒక ప్రజాస్వామిక దేశపు నాయకురాలి హత్యను ఘనంగా కీర్తిస్తూ పెరేడ్ నిర్వహించటం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ ఉదంతంపై దేశ రాజధాని న్యూఢిల్లీలోని కెనడియన్ హైకమిషనర్ కామెరూన్ మెక్ కే ట్వీట్ చేశారు. ఇందిర హత్యను కెనడాలో జరిగిన ఒక కార్యక్రమంలో సంబరంగా జరుపుకున్నట్లుగా వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ఈ ఉదంతంపై తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. విద్వేషానికి.. హింసను ఘనంగా కీర్తించటానికి కెనడాలో స్థానం లేదన్నారు. ఈ చర్యను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. అయితే.. ఇప్పటివరకు ఈ ఉదంతంపై కెనడా అధికారికంగా స్పందించింది. లేదు.