షాకిచ్చే రిపోర్టు: గుండెపోటు ముప్పు ఆ రోజే ఎక్కువట

కరోనా ముందుకు భిన్నంగా మహమ్మారి తర్వాత నుంచి వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు ఎక్కువ కావటం.. అప్పటివరకు బాగా ఉన్నవారు.. అమాంతం మరణిస్తున్న ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ కావటం తెలిసిందే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా.. అప్పటివరకు అందరితో హ్యాపీగా ఉండి.. ఉన్నట్లుండి చోటుచేసుకునే కార్డిక్ అరెస్టుతో ప్రాణాలు విడుస్తున్న వైనాలకు సంబంధించిన వీడియోలు తెగ భయాన్ని.. కొత్త ఆందోళనను గురి చేస్తున్నాయి.

ఇలా ఎందుకు జరుగుతుంది? అన్న విషయాన్ని ఇప్పటికి ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా గుండెపోటు ఎక్కువగా ఏ రోజుల్లో వస్తుంది? అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానం షాకింగ్ గా మారింది. కారణం ఏమిటి? అన్నది తేల్చలేదు కానీ.. ఒక అధ్యయనం చేసే క్రమంలో అందుబాటులోకి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ కొత్త విషయాన్ని గుర్తించారు.

గుండెపోట్లలోనూ రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి.. ‘‘సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ ఫార్ క్షన్’’ (స్టెమీ) అనేది ఒకరకమైన గుండెపోటు. అసలీ మాటే నోటికి తిరగటం లేదు సామీ అనొచ్చు. మరింత సింఫుల్ గా.. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. గుండె రక్త నాళం నూరు శాతం పూడుకుపోవటం. ఈ పరిస్థితి తలెత్తి.. తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పాటు ప్రాణాలు కోల్పోతుంటారు.

ఈ తరహా గుండెపోటుపై అధ్యయనాన్ని చేపట్టారు ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధకులు. ఈ అధ్యయనంలో భాగంగా 2013 నుంచి 2018 మధ్య కాలంలో ఐర్లాండ్ ఆసుపత్రుల్లో చేరిన ఈ తరహా పేషెంట్లకు చెందిన 10,528 మంది డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు గుర్తించిన కొత్త విషయం.. ఈ తరహా గుండెపోట్లు ఎక్కువగా ఆది.. సోమవారాల్లో వస్తున్నట్లుగా గుర్తించారు.

ఆదివారంతో పోలిస్తే సోమవారం ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. బ్రిటన్ లోని మాంచెస్టర్ లో జరిగిన బ్రిటన్ కార్డియోవాస్క్యుటర్ సొసైటీ కాన్ఫరెన్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. వారంలో ఏ రోజు ఎక్కువగా ఇలాంటివి వస్తున్నాయన్న విషయాన్ని తమ అధ్యయనం గుర్తించిందని పేర్కొన్నారు. ఈ సమాచారంతో భవిష్యత్తులో పలువురు ప్రాణాల్ని కాపాడే వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సోమవారానికి స్టెమీకి మధ్య సంబంధాన్ని గుర్తించామని.. ఈ అంశం గతంలోనే గుర్తించారని పేర్కొన్నారు. ఇలా ఎందుకు? అన్న విషయంలోకి వెళితే శరీరం నిద్రపోవటం.. లేచే సైకిల్ తో సంబంధం ఉందని భావిస్తున్నారు. దీన్ని కార్కాడియం రిథమ్ గా పేర్కొంటున్నారు. బ్లూ మండేగా పిలిచే ఈ పరిస్థితులు సోమవారమే ఎక్కువగా ఎందుకు వస్తున్నాయన్న ప్రశ్నకు మాత్రం వారు సరైన సమాధానాన్ని చెప్పలేకపోతున్నారు. స్టెమ్ బారిన పడినోళ్లకు అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఆ లక్షణాల్ని గుర్తించి.. రక్తనాళాల్లో పూడికను కరిగించే చికిత్స ఎంత త్వరగా చేస్తే.. అంత త్వరగా వ్యక్తి ప్రాణాల్ని సేవ్ చేసే వీలుంది.