ప్రజలకు సీరియస్ సలహా ఇచ్చిన కేంద్ర మంత్రి

సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కీలక సూచన చేశారు కేంద్ర టెలికం శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్. మొబైల్ ఫోన్లకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను అస్సలు ఎత్తొద్దని.. తెలిసిన నంబర్లకు మాత్రమే స్పందించాలని కోరారు. ఇటీవల కాలంలో టెలికం శాఖ తీసుకున్న చర్యలతో స్పామ్ కాల్స్.. సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు తగ్గినట్లుగా చెప్పిన ఆయన తాను చేసిన సూచనను సీరియస్ గా తీసుకోవాలన్నారు.

“తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను ఎప్పుడూ ఆన్సర్ చేయొద్దు. గుర్తించిన నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ కే స్పందించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్క పౌరుడికి విజ్ఞప్తి చేస్తున్నా. గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు.. ఎవరి నుంచి ఆ మెసేజ్ వచ్చిందో నిర్దారించుకున్న తర్వాతే స్పందించాలి” అని ఆయన కోరారు.

దాదాపు 40 లక్షలకు పైగా తప్పుడు సిమ్ లు.. 41 వేల అక్రమ పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లుగా చెప్పారు. ఇలాంటి కేసుల్ని గణనీయంగా తగ్గించటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉయోగిస్తున్నట్లుగా చెప్పారు. సో.. ఫోన్లు వాడుతున్న వారంతా.. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బీకేర్ ఫుల్.