ఘర్ వాపసీకి పిలుపు… రేవంత్ బంపరాఫర్

తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన పిలుపిచ్చారు. అదేమిటంటే ఘర్ వాపసీ గురించి ఆలోచించమని. పార్టీని వదిలి ఇతర పార్టీల్లో చేరిన వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్ లో చేరాలని పిలుపిచ్చారు. పార్టీకోసం, రాష్ట్రం కోసం అందరు తిరిగి రావాలని అవసరమైతే తాను కూడా ఒక మెట్టు తగ్గుతానని చెప్పారు. అందరినీ తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మని పిలుపిచ్చి అవసరమైతే తాను మెట్టు దిగుతానని చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు.

కేసీయార్ కు వ్యతిరేకంగా అందరు ఏకమవ్వాల్సిన అవసరముందని రేవంత్ నొక్కిచెప్పారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని అందరు ఆదరించాలన్నారు. తన నాయకత్వంలో పనిచేయాలా అని ఫీలవ్వద్దన్నారు. ఎందుకంటే తానే మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పనిచేస్తున్నట్లు చెప్పారు. తనతో మాట్లాడి పార్టీలో చేరటానికి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మిగిలిన సీనియర్లలో ఎవరితో అయినా మాట్లాడుకుని కాంగ్రెస్ లో చేరాలనే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు.

కర్నాటక ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. నరేంద్రమోడీ విధానాలకు కాలం చెల్లిందట. ఈడీ, సీబీఐ కేసులు, అరెస్టులను కర్నాటక ప్రజలు తిప్పికొట్టారని రేవంతన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటాన్ని కేసీయార్ తట్టుకోలేకపోతున్నట్లు రేవంత్ ఎద్దేవాచేశారు. అందుకనే బీజేపీ, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విషయాన్ని కూడా ఆలోచించినట్లు చెప్పారు. అయితే ముందుగానే ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు బయటపెట్టడంతో జేడీఎస్ వెనక్కు తగ్గినట్లు చెప్పారు.

దేశానికి, తెలంగాణాకు స్వాతంత్ర్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణా ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకుని బతకాల్సొచ్చేదని ఎద్దేవాచేశారు. కేసీయార్ కు ఇవే చివరి అవతరణ దినోత్సవాలని రాబోయే కాలంలో ఉత్సవాలను నిర్వహించేది కాంగ్రెస్ పార్టీనే అన్న ధీమాను వ్యక్తంచేశారు. వివేక్, ఈటల, రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీయార్ ను ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపినట్లు చెప్పారు. అయితే బీజేపీతో అది సాధ్యం కాదన్నారు. కేసీయార్ ను ఓడించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కాబట్టి అందరు కాంగ్రెస్ లో చేరాలని పిలుపిచ్చారు.