అమెరికాలో ఏం జ‌రుగుతోంది.. ప్ర‌పంచ కలవరం?

మ‌న‌కు ఒక సామెత ఉంది. అగ్ర‌రాజ్యం అమెరికాకు జ‌లుబు చేస్తే.. ప్ర‌పంచం మొత్తం తుమ్ముతుంది అని! ఇప్పుడు అచ్చం అలానే జ‌రుగుతోంది. అగ్ర‌రాజ్యంతో బంధం లేనిదేశం ఈ రోజు ఎక్క‌డా లేదు. ఏదో ఒక రూపంలో ఆ దేశంపై ఆధార‌ప‌డిన దేశాలు.. ఆదేశంలో వాణిజ్యం జ‌రుపుతున్న దేశాలు కోకొల్ల‌ల‌నే చెప్పాలి. అందుకే.. ఇప్పుడు అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణాల‌తో ప్ర‌పంచం మొత్తం క‌ల‌వ‌రానికి గురి అవుతోంది. మ‌రి అదేంటో చూద్దామా..!

ప్రపంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో బ్రిట‌న్‌, అమెరికా లు ప్ర‌ధానంగా గుర్తింపు పొందాయి. బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లుగా పుంజుకున్నాయి. అయితే.. కొన్నాళ్లుగా బ్రెగ్జిట్ కార‌ణంగా.. త‌ర్వాత‌.. కొలువుదీరిన కొత్త ప్ర‌భుత్వం ప‌న్నులు త‌గ్గించ‌డం కార‌ణంగా.. బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం త‌లెత్తింది. దీంతో అక్క‌డ ప్ర‌భుత్వం కూలిపోయి.. మ‌ళ్లీ తాజాగా సునాక్ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డింది.అయినా.. ఆర్థిక ప‌రిస్థితులు కుదుట ప‌డలేదు. అయితే.. దీని ప్ర‌భుత్వం యూరోపియ‌న్ దేశాల‌పై ఎక్కువ‌గా ఉన్న భార‌త్‌పై పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

కానీ, ఇప్పుడు అమెరికాకూడా ఇదే పంథాలో ముందుకు సాగుతోంది. దీంతో ఇప్పుడు భార‌త్ స‌హా అనేక ఆసియా దేశాలు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నాయి. ప్ర‌ధానంగా ద్ర‌వ్యోల్బ‌ణం భూతం పొంచి ఉంద‌ని అంటున్నారు. అగ్రరాజ్యం అమెరికాను ఆర్థిక స‌మ‌స్య భయపెడుతోంది. ఏకంగా జో బైడెన్‌ ప్రభుత్వం దివాలా అంచున నిలుచున్న‌ట్టు క‌నిపిస్తోంది. అప్పుల పరిమితిని పెంచడానికి కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఆమోద ముద్ర వేయకపోవడంతో అమెరికా ప్రభుత్వం డబ్బులకు కటకటలాడుతోంది.

ఏకంగా అధ్యక్షుడు బైడెన్‌ కీలక ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా ఏళ్ల కింద‌టే అమెరికా ప్రభుత్వం అప్పులను కాంగ్రెస్‌ నియంత్రించింది. వీటిపై పరిమితి విధించింది. అవసరాల రీత్యా ఈ పరిమితిని ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తున్నారు. 1917 నుంచి ఇప్పటిదాకా 78 సార్లు అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితిని సవరించారు.

అయితే.. ఇప్పుడు డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య పెరిగిన రాజకీయ వైరం, సైద్ధాంతిక విభేదాల కారణంగా అప్పులు చేసే మార్గం క‌నిపించ‌డం లేదు. 2021 నాటికి ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 ట్రిలియన్‌ డాలర్లు. దేశ జీడీపీ కంటే ఇది 24శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సుమారు 7 ట్రిలియన్‌ డాలర్లను విదేశాల నుంచి సేకరించింది.

జపాన్‌, చైనాల నుంచి బాండ్లు కొనుగోలు చేసినవారూ ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్‌ డాలర్లు. ఇదీ దాటి అప్పులు చేయడానికి బైడెన్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి కోరుతోంది. కానీ ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంపునకు ససేమిరా అంటున్నారు. మరింత అప్పు అంటే ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ లేనట్లేనని, భవిష్యత్‌ ఖర్చులు తగ్గించుకోవాలని వాదిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అప్పుల పరిమితి పెంచకుంటే జూన్‌ ఒకటోతేదీ లోపు ఏ క్షణమైనా ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోతాయని తెలుస్తోంది. అప్పుల పరిమితికి ప్రభుత్వం చేరుకుందంటే అదనంగా అప్పులు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు, పన్నుల ద్వారా వచ్చే సొమ్మునే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం అప్పులు, వడ్డీలు, బిల్లులు తీర్చలేని పరిస్థితి వస్తుందో అది సాంకేతికంగా దివాలా తీసినట్లుగా భావిస్తారు. ఇదే ఇప్పుడు ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర పెడుతోంది. మ‌రి ఏం చేస్తారో ఎలా బ‌య‌ట ప‌డ‌తారో చూడాలి.