వైరల్ వీడియో.. ‘విక్రమార్కుడు’లో యశస్వి జైశ్వాల్!

యశస్వి జైశ్వాల్.. ఈ ఐపీఎల్‌లో కోహ్లి, రోహిత్ లాంటి సూపర్ స్టార్ క్రికెటర్లను మించి ఎక్కువ చర్చనీయాంశం అవుతున్న పేరు. ముంబయికి చెందిన ఒక పేద కుటుంబానికి చెందిన ఈ కుర్రాడు ఐపీఎల్‌లో ఈ సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచే వరకు సాగిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. మహా మహా బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి నెట్టి అతను పరుగుల వరద పారిస్తున్నాడు ఈ సీజన్లో.

కొన్నేళ్ల నుంచి ఐపీఎల్‌లో నిలకడగా ఆడుతున్నప్పటికీ.. ఈసారి మాత్రం అతను వేరే లెవెల్లో ఆడేస్తున్నాడు. ఒక సెంచరీతో పాటు 98 పరుగుల ఇన్నింగ్స్‌తో అందరూ తన గురించి చర్చించుకునేలా చేశాడు. ఈ కుర్రాడికి సంబంధించిన ఒక మీమ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ముఖ్యంగా మీమ్స్ చేయడంలో తిరుగులేని రికార్డున్న తెలుగు వాళ్లు జైశ్వాల్ మీమ్‌‌తో తమ టాలెంట్ ఏంటో చూపిస్తున్నారు.

రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటైన ‘విక్రమార్కుడు’లో క్రికెట్ ఆడుతున్న పిల్లాడు రవితేజ ఇంట్లో బాల్ పడితే.. అతడి కాంపౌండ్లోకి వచ్చి ‘‘రేయ్ సత్తీ.. బాల్ ఇటు వచ్చిందా’’ అని అడుగుతాడు. ఆ పిల్లాడ్ని ఇటు రా అని రవితేజ చితకబాదడం.. తర్వాత ఆ పిల్లాడి తల్లి కాలనీ ఆడోళ్లందరితో వచ్చి రవితేజ మీద ఎటాక్ చేయడం.. ఈ క్రమంలో హిలేరియస్ కామెడీ పండుతుంది. ఐతే రవితేజను బాల్ ఉందా అని అడిగే కుర్రాడు.. పెరిగి పెద్దయి ఇప్పుడు యశస్వి జైశ్వాల్ అయ్యాడంటూ మీమ్ తయారు చేశారు.

పిల్లాడు గుండుతో చిన్నప్పటి యశస్వి లాగే కనిపిస్తుండటంతో ఈ మీమ్ భలే సెట్ అయింది. ఇది కామెడీ కోసం వేసిన మీమ్ అని తెలియని వాళ్లు నిజంగానే యశస్వి చిన్నతనంలో ‘విక్రమార్కుడు’ సినిమాలో నటించాడని అనుకున్నా ఆశ్చర్యం లేదు. మహరాష్ట్రకు చెందిన ఒక పేద కుటుంబంలో పుట్టిన యశస్వి.. క్రికెట్ ఆడే రోజుల్లో సరైన వసతులు లేక ఒక టెంట్లో ఉండటం.. పగలంతా క్రికెట్ సాధన చేస్తూ.. సాయంత్రం పానీపూరి బండి దగ్గర పని చేయడం.. అలా కష్టపడి ఎదిగి ఈ స్థాయికి చేరుకోవడం విశేషం.