ఆ మోడల్ ఇప్పుడు సివిల్స్ టాపర్ గా నిలిచింది

ఫ్యాషన్ రంగానికి.. ప్రజాసేవకు ఏ మాత్రం పోలిక ఉండదు. కానీ.. కొన్నిసార్లు రేర్ కాంబినేషన్లు అలా సెట్ అవుతాయి. తాజాగా సివిల్స్ ఫలితాలు వెల్లడి కావటం తెలిసిందే. మీడియా కన్ను పెద్దగా పడని ఒక పేరు ఉంది ఆమె పేరే ఐశ్వర్య. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో టాప్ 100లోపు ర్యాంక్ సాధించి టాపర్ గా నిలిచింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ టాపర్ కు తెలంగాణతో లింకు ఉంది. ఇంతకీ మోడల్ గా ర్యాంప్ మీద హోయలు ఒలికించిన ఆమె.. ఇప్పుడు ఐఏఎస్ అధికారిణిగా కానీ ఐపీఎస్ అధికారిణినిగా కానీ బాధ్యతలు చేపట్టనున్నారు. ర్యాంప్ నుంచి సివిల్స్ అధికారిణిగా ఆమె ప్రయాణం చూస్తే..

ఐశ్వర్య వాళ్లది రాజస్థాన్. తండ్రి తెలంగాణలోని కరీంనగర్ ఎన్ సీసీ బెటాలియన్ లో కమాండింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె తల్లి.. ఇంట్లోనే ఉండేవారు. ఆమెకు సినీనటి ఐశ్వర్యారాయ్ అంటే ఎంతో ఇష్టం. మోడల్ గా ఉన్నప్పటి నుంచి ఆమె ఐశ్వర్యను ఫాలో అయ్యేవారు. అందుకే తనకు కూతురు పుడితే మోడలింగ్ చేయంచాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు.. కూతురికి ఐశ్వర్య పేరును పెట్టటానికి కారణం కూడా ఆమె మీద ఉన్న అభిమానమే. తల్లి ప్రోత్సాహం ఉండటంతో చిన్ననాటి నుంచి అందాల పోటీలో విజయం సాధించటమే లక్ష్యంగా పెట్టుకుంది.

చిన్నప్పటి నుంచి చదువుల్లో చరుగ్గానే ఉండేది. మంచి మార్కులు వచ్చేవి. చదువు మీద పెద్దగా ఫోకస్ పెట్టన్నప్పటికి మంచి పేరే ఉండేది. తల్లితో కలిసి ఢిల్లీలో ఉండేవారు. 2014లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో పేరు ఇచ్చింది ఐశ్వర్య. ఊహించని రీతిలో టైటిల్ సొంతం చేసుకోవటంతో ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నిర్వాహకులుఆమెను అభినందిస్తూ.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని సలహా ఇచ్చారు. అరడుగుల రూపంతో పాటు నలుగురితో కలిసిపోయే తత్త్వం.. దీనికి తోడు తెలివితేటలకు తిరుగులేనట్లుగా ఉండే ఆమె.. ఓవైపు మోడలింగ్ చేస్తూనే అందాల పోటీల్లో పాల్గొనేవారు.

2016 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్టులుగా నిలిచారు కానీ.. విజేతగా నిలవలేకపోయారు. విజేతగా నిలవకున్నా.. ఫైనలిస్టుగా నిలిచి తల్లి కోరిక తీర్చారు. 2017లో లాక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసిన అందరి కంట్లో పడ్డారు. ప్రముఖులతో కలిసి ర్యాంప్ వాక్ చేస్తూనే.. మోడలింగ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న వేళ.. సివిల్స్ ను సాధించాలన్న భావన కలిగిందని చెబుతారు. అలా మొదలైన ఆలోచన.. దాన్ని సాధించాలన్న పట్టుదల పెరిగింది.

ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోకుండా ఆమె చేసిన మొదటి పని తన మొబైల్ ఫోన్ ను ఆఫ్ చేయటం. సోషల్ మీడియాకు దూరంగా ఉండటం. చదువు మీద తప్పించి మరే అంశం మీదా ఫోకస్ పెట్టలేదు. అదే సమయంలో 2018లో ఐఐఎం – ఇండోర్ లో సీటును సొంతం చేసుకున్నారు. కానీ.. సివిల్స్ టార్గెట్ కావటంతో దాన్ని వదిలేసుకున్నారు. చాలా తక్కువ వ్యవధిలోనే తాను అనుకున్నది సాధించినట్లు చెబుతారు. మోడలింగ్ నుంచి సివిల్స్ ను సాధించిన అతి అరుదైన మహిళగా ఐశ్వర్య నిలిచారని చెప్పక తప్పదు. తండ్రి మాదిరి కల్నల్ అయ్యేందుకు ఆర్మీకి వెళ్లాలని అనుకున్నట్లుగా ఆమె చెబుతారు. ప్రజలకు సేవ చేసేందుకు సివిల్స్ తోనే సాధ్యం కావటంతో ఆమె ఫోకస్ దీని మీద పెట్టటం.. అది కాస్తా సొంతం చేసుకొని సరికొత్త చరిత్రను లిఖించారని చెప్పక తప్పదు.