హైదరాబాద్ లో గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు చనిపోయారు

హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు అనూహ్యరీతిలో మరణించారు. గుర్రాన్ని కాపాడే క్రమంలో వారు ప్రాణాలు కోల్పోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిషన్ బాగ్ కు చెందిన అజం అనే వ్యక్తి కిస్మత్ పూర్ లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుంటాడు. అజం అన్న కొడుకు సైఫ్ అతడికి సాయం చేస్తుంటాడు. ఒకట్రెండు రోజుల క్రితమే రాజస్థాన్ కు చెందిన అశీష్ సింగ్ అనే యువకుడు వారి వద్ద పనికి చేరాడు.

ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం గుర్రాన్ని ఈసా నదికి తీసుకెళ్లారు. వేసవి తాపాన్ని తట్టుకోలేని గుర్రం.. ఈసా నదిలోకి పరుగులు తీసింది. దీంతో.. దాని కళ్లాన్ని పట్టుకున్న అశీశ్ సింగ్ దాంతో నదిలోకి వెళ్లాడు. అనూహ్యంగా గుర్రం నీట మునిగిపోయింది. దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించిన అశీష్ సింగ్ గుర్రంతో పాటు నీట మునిగాడు. వీరిని రక్షించేందుకు సైఫ్ నదిలోకి దిగాడు. అయితే.. అతను సైతం నీట మునిగిపోయాడు.

వీరిని గుర్తించిన స్థానికులు గుర్రం శిక్షణ కేంద్రం నిర్వాహకుడు అజంకు సమాచారం ఇవచ్చారు. వారు గుర్రంతోపాటు నీట మునిగిన ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. వారు గల్లంతయ్యారు. దీంతో.. వారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే గుర్రంతో పాటు అశీష్ సింగ్.. సైఫ్ లు మరణించినట్లుగా తేలింది. గుర్రాన్ని కాపాడే క్రమంలో ఇద్దరు యువకులు మరణించిన వైనం స్థానికంగా విషాదాన్ని నింపింది.