హైద‌రాబాదీ క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌


మూడేళ్ల త‌ర్వాత ఉప్ప‌ల్ స్టేడియానికి ఐపీఎల్ సంద‌డి తిరిగి రావ‌డంతో హైద‌రాబాద్ క్రికెట్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సీజ‌న్లో తొమ్మిది మ్యాచ్‌ల‌ను ఉప్ప‌ల్ స్టేడియంలో ఆడుతోంది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌. ఐతే ఉప్ప‌ల్ స్టేడియంలో గ‌తంతో పోలిస్తే అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు త‌గ్గిపోవ‌డం ఇక్క‌డి అభిమానుల‌కు కొంత నిరాశ క‌లిగించే విష‌య‌మే. కానీ ఈ ఏడాది చివ‌ర్లో జ‌రిగే ప్ర‌తిష్టాత్మ‌క వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వేదిక‌ల్లో ఒక‌టిగా ఉప్ప‌ల్ స్టేడియం ఉండ‌టం అభిమానుల‌కు ఆనందాన్నిచ్చే విష‌య‌మే.

అంత‌కుమించిన ఆనందం ఏంటంటే.. ఆ టోర్నీ జ‌రిగే స‌మ‌యానికి ఉప్ప‌ల్ స్టేడియం కొత్త రూపు సంత‌రించుకోనుంది. ఈ టోర్నీ బీసీసీఐ దేశంలోని ఐదు క్రికెట్ స్టేడియాల్నిపునరుద్ధరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రూ.500 కోట్ల నిధులు కూడా కేటాయించింది. ఈ ఐదు స్టేడియాల్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం కూడా ఉండ‌టం విశేషం.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం రెనోవేషన్ కోసం రూ.100 కోట్లు కేటాయించిన బీసీసీఐ.. ఉప్పల్ స్టేడియం కోసం రూ.117.17 కోట్లు, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కోసం రూ.127.47 కోట్లు, మొహాలిలోని పీసీఏ స్టేడియం కోసం రూ.79.46 కోట్లు, ముంబయిలోని వాంఖడే స్టేడియం కోసం రూ.78.82 కోట్లు కేటాయించింది. ఒకేసారి రూ.117 కోట్ల‌తో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు అంటే.. ఉప్ప‌ల్ స్టేడియం రూపు రేఖ‌లు మారిపోవ‌డం ఖాయం.

స్టేడియంలో స‌గం స్టాండ్స్‌కే పైక‌ప్పులు ఉన్నాయి. ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యానికి మొత్తం స్టేడియం అంతా పైక‌ప్పులు రావ‌డం ప‌క్కా. అంతే కాక స్టేడియంలో సీటింగ్, ఇత‌ర వ‌స‌తుల‌ను కూడా మెరుగుప‌ర‌చ‌నున్నారు. మొత్తం ప‌ని అయ్యాక దేశంలోనే అత్యుత్త‌మ స్టేడియాల్లో ఒక‌టిగా ఉప్ప‌ల్ మైదానంలో మార‌డం ఖాయం. కాక‌పోతే అవినీతికి పేరుప‌డ్డ హెచ్‌సీఏలో ఈ నిధుల‌ను ఎక్క‌డ ప‌క్క‌దారి ప‌ట్టిస్తారో అన్న సందేహాలు అభిమానుల్లో క‌లుగుతున్నాయి.