ఈసారి ఐపీఎల్ సన్‌రైజర్స్‌దేనా?

ఐపీఎల్ సందడి మొదలైపోయింది. ఎప్పటిలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు ఈసారి తమ అభిమాన టీం కప్పు కొట్టాలని ఆకాంక్షిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఓటమి పాలైనప్పటికీ అభిమానులు కొత్త సెంటిమెంట్లను బయటకు తీయడంతో పాటు గత ఐపీఎల్‌లలోని ప్యాటర్న్ ఒకటి చూపిస్తూ ఈసారి విజయం మాదే అంటున్నారు.

2014 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు ఆరోస్థానంలో నిలిచింది. ఆ తరువాత ఏడాది కూడా ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది. కానీ.. 2016కి వచ్చేసరికి విజేతగా అవతరించింది. ఇప్పుడు 2023లో కూడా అదే తరహాలో విజయం సాధిస్తుంది ఈ జట్టు అంటున్నారు అభిమానులు. అందుకు ఆధారంగా ఐపీఎల్ లో సన్‌రైజర్స్ పర్ఫార్మెన్స్ ప్యాటర్న్ ఒకటి చూపిస్తున్నారు. 2014, 2015లో ఆరోస్తానంలో నిలిచి 2016లో కప్పు కొట్టినట్లే…

2021, 2022లో ఎనిమిదో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ జట్టు ఇప్పుడు 2023లో కప్పు కొడుతుందని చెప్తున్నారు. ఈ సెంటిమెంట్ సంగతి ఏమో కానీ సన్‌రైజర్స్ జట్టును చూస్తే ఏమంత బలంగా లేదని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఎక్కువ మంది కొత్త కుర్రాళ్లే ఉండడం, బ్యాటింగ్ బలహీనంగా ఉండడం వంటివన్నీ ఈ జట్టుకు ఇబ్బందికరంగా చెప్తున్నారు. అయితే, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్, స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లతో జట్టు బౌలింగ్ విభాగం బలంగా ఉంది.

వీరిద్దరితో పాటు ఆదిల్ రషీద్ కూడా ఇంప్రెసివ్ బౌలరే. అయితే.. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థికి 200 పైగా పరుగులు చేసే అవకాశం ఇవ్వడంతో ఒక్క బౌలింగ్‌పైనే ఆధారపడితే చాలదని అర్థమవుతోంది. బ్యాటింగ్ విభాగం కొంత బలహీనంగా ఉంది.. మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొత్త కుర్రాళ్లలో ఎవరైనా మెరుపులు మెరిపిస్తే తప్ప అభిమానులు ఆశిస్తున్నట్లు అద్భుతాలు జరగకపోవచ్చంటున్నారు.